Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIR‌పై ప్రకాష్ రాజ్ వార్నింగ్..

  • ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు..
  • SIR ప్రక్రియపై నటుడి ఆగ్రహం..
  • ఆట మొదలు పెట్టారని వార్నింగ్..
Prakash Raj

Prakash Raj

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR (Special Intensive Revision) ప్రక్రియలో తన ఓటును తొలగించారని పేర్కొన్నారు. బెంగళూర్ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెంగళూర్‌లోనే పుట్టి, పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని అన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశానని, తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను కూడా ఒకడినని అన్నారు.

తన ఓటర్ ఐడీ తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలను సమర్పించాలో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘‘పెద్ద జోక్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘నా ఓటర్ ఐడీని తిరిగి పొందడానికి నేను ఏ పత్రాలను చూపించాలో చూస్తాను. ఆట మొదలైంది, తమ శక్తిని ప్రదర్శించడానికి వారు ఇవన్నీ చేయగలరు. నా ఓటు హక్కును వాళ్లు ఆపగలరు, కానీ నన్ను ఆపగలరా?’’ అంటూ ప్రశ్నించారు.

ప్రకాష్ రాజ్ ఓటు హక్కుకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. గత జూన్ నెలలో బెంగళూర్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో న్యాయవాది దిలీప్ కుమార్ హలసూర్ గేట్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియలో ఆయన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన ఓటు హక్కును తిరిగి పొందేకు అవసరమైన పత్రాలనను సమర్పిస్తానని తెలిపారు.