NTV Telugu Site icon

AP DGP: శాంతి భద్రతలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Ap Dgp

Ap Dgp

AP DGP: వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్‌ పలు శాఖలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లా స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. గంజాయి సాగు, రవాణాలోని కింగ్ పిన్‌లను పట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలతో నిఘా పెంచుతామన్నారు. నరసాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో కూడా సీసీ కెమెరాలను వినియోగించామని డీజీపీ స్పష్టం చేశారు.

Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు

ఎక్సైజ్ శాఖపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్‌డీపీఎల్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా నిఘా పెట్టాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం ఎక్కడికి వెళ్లిందో అందరూ చూశారని.. నెల రోజుల్లో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు.

పౌర సంబంధాల శాఖపై ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార యుద్దం ఫీల్డు నుంచి ఫీడ్‌కు వచ్చిందన్నారు. దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను ఏది నిజం.. ఏది దుష్ప్రచారం అనేది ప్రజలకు తెలపాలని సూచించారు. జిల్లా స్థాయిలో కూడా మీడియా మానిటరింగ్ టీంలు ఉండాలన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగితే.. వాటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు.