Not to Sell My Vote: ఎన్నికలంటేనే హడావిడి.. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది వివిధ రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుంటారు. ఎన్నికల్లో విజయే లక్ష్యంగా.. డబ్బులు, మద్యం ఏరులైపారిస్తుంటారు.. కొన్ని వర్గాలను, కొన్ని కుటుంబాలను టార్గెట్ చేసి డబ్బులు కుమ్మరిస్తుంటారు.. అయితే, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ ఓటు అమ్ముకోబోమంటున్నారు.. వారు ప్రతిజ్ఞ బూనడమే కాదు.. ఆ ఊరిలోకి వచ్చేవారికి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో.. ఊరంతా గోడ పత్రాలు.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Read Also: HD Revanna: ప్రజ్వల్ తండ్రికి జ్యుడీషియల్ కస్టడీ.. ఎప్పటివరకంటే..!
ఇక, అసలు విషయానికి వస్తే.. చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు.. మీకు అన్ని విధాలా సహకరిస్తాం.. మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులందరూ తమ ఇంటి ముందు గ్రామాల్లో గోడపత్రాలను ఏర్పాటు చేశారు.. మా గ్రామ అభివృద్దే మా లక్ష్యం ఎన్నికల్లో మేం ఎలాంటి తాయిలాలకు మా ఓట్లు అమ్ముకోబోము.. మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓట్లు అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముంది నా ఓటు అమ్మకానికి లేదు అనే గోడ పత్రాన్ని అంటించారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ఓటు ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తున్నారు..