Mother Murder Case: కన్న పేగు బంధాన్ని మరచి.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని ఓ కూతురు హత్య చేసిన ఘటన కలకం రేపుతోంది.. గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ మహిళను ఆమె కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు 8వ వార్డులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మిగా గుర్తించారు.
డబ్బుల విషయంలో తల్లితో గొడవ
లక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె కుమారుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె కూతురు పుష్పలత ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగినప్పటికీ కుటుంబ కలహాల కారణంగా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పుష్పలత.. రాజా అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లక్ష్మి తన బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని పుష్పలత తల్లిని కోరినట్లు తెలుస్తోంది. అయితే అందుకు లక్ష్మి అంగీకరించకపోవడంతో వివాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు
డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి తల్లి లక్ష్మిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, డబ్బుల వ్యవహారం, నిందితుల పాత్ర తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

