రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం హామీల అమలు లో కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఆయన అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయన్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెట్టారని, చేయూత ,రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేదని దరఖాస్తులు తీసుకున్నారని ఆయన అన్నారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని, మొత్తానికి ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరి తో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేదాకా కాల యాపన చేసి ఏడాది దాకా హామీలను ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తోందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని, కాంగ్రెస్ లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారని ప్రశ్నించారు. కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని అప్పుడే విజయం అధ్యమన్నారు. పార్టీ లో ప్రక్షాళన జరగాలన్నారు. కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సమీక్షలు తప్ప ఫలితాలు లేవన్నారు. గృహలక్ష్మి పథకం రద్దు చేశారు ..మరి ఎంపిక చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరే హామీ అమలు కావడం లేదని, రైతు బంధు ఎవరికీ సరిగ్గా అందలేదు, రైతు రుణమాఫీ గురించి ఊసే లేదని, వడ్లకు బోనస్ ఏది అని ప్రశ్నించారు.