Hyderabad Traffic Restrictions: నేడు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు లక్ష మంది వరకు జనం వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పరేడ్ గ్రౌండ్స్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి సీపీ బి.సుమతి పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 2,000 మందికి పైగా పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), OCTOPUS, ప్రత్యేక బలగాలు నిరంతరం పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పర్యవేక్షిస్తున్నాయి. ఈ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, ప్రజలు మధ్యాహ్నం 13:00 గంటల నుంచి రాత్రి 20:00 గంటల మధ్య ఈ క్రింది రోడ్ల మార్గాల్లో ప్రయాణించవద్దని కోరారు.
బేగంపేట ఎయిర్పోర్ట్ – బేగంపేట – గ్రీన్ల్యాండ్స్ – పంజాగుట్ట – నాగార్జున సర్కిల్ – NFCL జంక్షన్ – SNT జంక్షన్ – సాగర్ సొసైటీ – NTR భవన్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – పెద్దమ్మ తల్లి ఖమాన్ – రోడ్ నెం. 36/31 – నీరూస్ జంక్షన్ – సైబర్ టవర్స్ జంక్షన్ – శిల్పారామం – హైటెక్స్ ఖమాన్ వద్ద కుడి మలుపు – NAC మెయిన్ గేట్ – బ్లాక్ 22 – ఎడమ మలుపు – కాసాని గేట్ – కుడి మలుపు – HICC చెక్ పోస్ట్ – రాక్ సర్కిల్ – VVIP అలైటింగ్ పాయింట్ ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండనుంది.
అలాగే, మధ్యాహ్నం 14:00 గంటల నుంచి రాత్రి 22:00 గంటల మధ్య M.G. రోడ్, R.P. రోడ్, S.D. రోడ్ మార్గాల్లో ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాలనుకునే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడానికి ముందస్తుగా బయలుదేరాలని కోరారు. సాధ్యమైనంత వరకు పౌరులు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగర పౌరులు పైన పేర్కొన్న ట్రాఫిక్ సూచనలను గమనించి, ఆయా సమయాల్లో తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు. సమాచారం కోసం మా హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ (9010203626) అందుబాటులో ఉంటుందని, సోషల్ మీడియాలోనూ సంప్రదించాలని కోరారు.
