NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు

Pawan Kalyan

Pawan Kalyan

Naga Babu on Pithapuram Voters: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.

సోమవారం ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. పిఠాపురం నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘అభిమానంతో ఓటేయడం వేరు, ఇష్టంతో ఓటేయడం వేరు. కానీ ప్రేమతో ఓటేయడం సంతోషంగా ఉంటుంది. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. క్షేత్రస్థాయిలో పని చేసిన నాయకులు, వీరమహిళల శ్రమ వెలకట్టలేనిది. టీడీపీ, బీజేపీ శ్రేణులతో మమేకమైన తీరు మరువలేనిది. పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం ప్రజలు మరింత బాధ్యతను పెంచారు’ అని అన్నారు.

Also Read: Telangana: సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్.. కలెక్టర్ అభినందన

‘సాధారణంగా నియోజకవర్గ అభ్యర్ధి గెలుపు కోసం పోరాటం చేయడమే కష్టం. కానీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఒత్తిడి ఏర్పడిందనేది వాస్తవం. అయినా వారు ముందుకు నడిచారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవను ప్రశంసిస్తున్నా. మండల, పట్టణ, వార్డు స్థాయిలో కమిటీలుగా ఏర్పడి పవన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తాం’ అని నాగబాబు పేర్కొన్నారు.