ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభాకర్ రావును విచారించింది. 14 రోజుల కస్టడీ విచారణ నిన్నటితో ముగియగా.. ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ను కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ విచారణ పూర్తయిన తర్వాత సిట్ వైద్య పరీక్షలు చేసింది.
రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. మొదట విచారణకు సహకరించని ఆయన.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో కొన్నిటికి సమాధానాలు చెప్పారట. ప్రభాకర్ రావు తన పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారట. ఇక టాపింగ్ కేసులో ఓ పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన సమయంలో పెన్ డ్రైవ్లో టాపింగ్ వివరాలు స్టోర్ చేశారట. రెండు వారాల విచారణకు సంబంధించిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ బృందం అందించనుంది. జనవరి 16న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ సహా ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
