CNG Price Hike: సీఎన్‌జీ వాహనదారులకు మళ్లీ షాక్‌.. మరోసారి పెరిగిన ధరలు

Cng

Cng

CNG Price Hike: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. శనివారం మరోసారి ఇంధన ధరలను పెంచడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరగగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. అలాగే సీఎన్‌జీ ధరను కిలోకు రూ.1 పెంచారు. గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఇంతకుముందు మే 15న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను ఒక్కోటి రూ.3 చొప్పున పెంచారు. ఆ తర్వాత మే 19న కూడా పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు వడ్డించారు.. తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.5 వరకు పెరిగాయి. సీఎన్‌జీ ధర కూడా రెండోసారి పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.64 నుంచి రూ.99.51కి చేరుకుంది. డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ.92.49కు పెరిగింది. ఇక సీఎన్‌జీ ధర కిలోకు రూ.81.09గా నమోదైంది.

ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని సూచించింది. ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలిక రద్దీ కనిపిస్తున్నప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా ఖర్చులపై పడే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.