భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్. కానీ.. పాక్ డ్రోన్లు సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే, భారత రక్షణ వ్యవస్థ వెంటనే చురుగ్గా మారి అన్ని డ్రోన్లను కూల్చివేసింది. పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు, అన్నీ భారత రక్షణ వ్యవస్థ ముందు అసమర్థంగా మారుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న డ్రోన్స్ అన్నీ పేలుడు పదార్థాలతో నిండి ఉన్నాయి. ఇది జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పడి ఉంటే, చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. భారత సైన్యం చాకచక్యం వల్ల డ్రోన్లు ధ్వంసమవడమే కాకుండా.. వాటి శిథిలాలను పౌరులకు దూరంగా ఉన్న ప్రాంతంలో పడేలా చేస్తున్నారు. దీని కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
బైకర్ YIHA-III కమికేజ్ డ్రోన్ అంటే ఏమిటి?
పాకిస్థాన్ భారతదేశంపై డ్రోన్ YIHA-IIIను ప్రయోగించింది.. ఇది “లోయరింగ్ మందుగుండు సామగ్రి” డ్రోన్. ఈ డ్రోన్లు ఏదైనా రక్షణ వ్యవస్థపై లేదా ముందుకు పనిచేసే స్థావరంపై సులభంగా దాడి చేయగలిగేలా అభివృద్ధి చేశారు. ఈ డ్రోన్కు మరో ప్రత్యేకత ఉంది. అవి చాలా గంటలు గాలిలో ఉండగలవు. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ.. పాకిస్థాన్కి చెందిన ఈ డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థ ముందు మోకరిల్లుతున్నాయి. భారత సైన్యం ఇప్పటివరకు వందలాది డ్రోన్లను ధ్వంసం చేసింది. కాగా.. YIHA-III డ్రోన్ను టర్కిష్ రక్షణ సంస్థ అభివృద్ధి చేసింది. వీటిని సిరియా, ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ ప్రయోగిస్తోంది.
ఫెయిల్ అవుతున్న పాకిస్థాన్ క్షిపణి..
పాకిస్థాన్ తన క్షిపణి ఫతే-1 ను జమ్మూ వైమానిక స్థావరం, ఉధంపూర్ పై ప్రయోగించింది. ఈ ఫతే-1 క్షిపణిని భారత్ బరాక్-8 క్షిపణితో మట్టికరిపించింది. ఫతే-1 క్షిపణి పరిధి 140 కిలోమీటర్లు. ఈ క్షిపణి పలు రకాల వార్హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ట్రక్కు ఆధారిత లాంచర్ నుంచి ప్రయోగించవచ్చు. భారతదేశం ప్రయోగించిన బరాక్-8 క్షిపణి పాకిస్థాన్ క్షిపణిని నిమిషాల్లోనే ధ్వంసం చేసింది.
టర్కిష్ డ్రోన్లన్నీ విఫలం..
పాకిస్థాన్ మే 8వ తేదీన భారత్లోని 36 ప్రదేశాలకు 300 నుంచి 400 డ్రోన్లను పంపింది. ఈ డ్రోన్స్ అన్నీ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత సైన్యం అన్ని డ్రోన్లను కూల్చివేసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. డ్రోన్ శిథిలాల చూస్తే.. ఇవన్నీ టర్కిష్ అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లని తేలింది. టర్కిష్ సైన్యం 2020 నుంచి ఈ డ్రోన్ను ఉపయోగిస్తోంది. ఇది 9 కిలోల వరకు బరువును మోయగలదు. కానీ.. ఇవన్నీ భారత ఆయుధాల ముందు ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా టర్కీకి చెందిన డ్రోన్స్ ను భారత్ ఇట్టే నేలమట్టం చేస్తోంది.