పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. వేర్వేరు వర్గాలకు చెందిన యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో.. ఒక ఉన్మాద మూక ఏకంగా ఒక గ్రామాన్నే తగలబెట్టింది. ఈ అనాగరిక దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
అసలేం జరిగిందంటే..
సింధ్ ప్రావిన్స్లోని బురిర్రో తెగకు చెందిన ఒక యువకుడు, చన్నా తెగకు చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ యువతి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా, వారి అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి చన్నా తెగకు చెందిన పెద్దలకు తీవ్ర అవమానంగా అనిపించింది. దీనిని తమ కుల అహంకారానికి జరిగిన భంగంగా భావించిన వారు.. బురిర్రో తెగపై ప్రతికారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
గ్రామంపై సాయుధ మూక దాడి..
ఈ క్రమంలో చన్నా తెగకు చెందిన దాదాపు వంద మందికి పైగా సాయుధ పురుషులు ఒక ముఠాగా ఏర్పడి, యువకుడి గ్రామంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వారి చేతుల్లో తుపాకులు, కర్రలు, పెట్రోల్ బాటిళ్లు ఉన్నాయి. గ్రామంలోకి చొరబడిన ఆ మూక కంటికి కనిపించిన ఇళ్లపై దాడి చేస్తూ.. నిప్పు పెట్టడం ప్రారంభించింది. చూస్తూనే ఉండగానే ఇళ్లు అగ్నిఆహుతై, మొత్తం గ్రామం నిప్పుల కుంపటిలా మారింది.
ఈ ఆకస్మిక దాడితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు, మహిళలు, పిల్లలు చెల్లాచెదురుగా పారిపోయారు. బాధితుల ఆస్తులు, పశువులు, నిత్యావసర వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘాతుకం పాకిస్తాన్లో ఇంకా కొనసాగుతున్న కుల అహంకారానికి, గిరిజన వివాదాల తీవ్రతకు అద్దం పడుతోంది.
