ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయని.. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని తేలినట్లు చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అతన్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారు? అని ప్రశ్నించారు.
READ MORE: CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
ఈ దాడికి సంబంధించి ప్రపంచాన్ని పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిలయంగా మారిందని.. ఇందులో మసూద్ అజార్, హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఉన్నారన్నారు. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటోందని.. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘాటించారు. “పాకిస్థాన్ పహల్గామ్ దాడిపై ఉమ్మడి దర్యాప్తు చేయాలని ప్రతిపాదన తెచ్చింది. మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక వ్యూహం. 26/11, పఠాన్కోట్ వంటి దాడుల దర్యాప్తులో భారతదేశం సహకరించింది. కానీ పాకిస్థాన్ ఆ కేసులను పక్కన పెట్టింది. ముంబై దాడిపై వివరణాత్మక ఆధారాలు అందించినప్పటికీ.. ఎటువంటి ఖచ్చితమైన చర్య తీసుకోలేదు. పఠాన్కోట్ కేసులో డీఎన్ఏ విశ్లేషణ, ఉగ్రవాద సంస్థల అధికారుల సమాచారాన్ని పాకిస్థాన్ బృందానికి అందించాం. కానీ ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.” అని మిస్రీ వ్యాఖ్యానించారు.