పాకిస్థాన్లో భారీ ఇంధన సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన దగ్గర నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా హౌతీలు సౌదీపై దాడులు ఉధృతం చేయడంతో ప్రస్తుతం చమురు సంక్షోభంగా మరింత కఠినంగా మారింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష పీటీఐ నేతలు గాడిద బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు.
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. పెట్రోల్ ధరలు రూ.400కు చేరువ కావడాన్ని నిరసిస్తూ సింధ్ అసెంబ్లీకి గాడిద బండ్లపై వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పెట్రోల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డాన్ నివేదిక ప్రకారం.. PTI నేత సజ్జాద్ అలీ సూమ్రో నేతృత్వంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సింధ్ అసెంబ్లీకి సమీపంలోని ప్రాంతాల నుంచి గాడిద బండ్లపై ప్రయాణించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు చేరుకున్న వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై సజ్జాద్ అలీ తీవ్రంగా స్పందించారు. ప్రజలపై ప్రభుత్వం ‘పెట్రోల్ బాంబు’ వేసిందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “పెట్రోల్ ధర ఎంతగా పెరిగిందంటే.. మా వాహనాల్లో అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నాం. ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు” అని సజ్జాద్ అలీ పేర్కొన్నట్లు డాన్ నివేదించింది.
రూ.400కు చేరువైన పెట్రోల్ ధర
పాకిస్థాన్లో ఇటీవల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గురువారం ప్రకటించిన తాజా ధరల సవరణ ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్కు రూ.390.79కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర లీటర్కు రూ.424.92గా ఉంది. ఈ ధరల్లో ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాలు కూడా ఉన్నాయి. పెట్రోల్పై లీటర్కు రూ.114, డీజిల్పై లీటర్కు రూ.100 చొప్పున పన్నులు, సుంకాలు ఉన్నట్లు డాన్ నివేదించింది.

