ప్రస్తుతం పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలతో చికిత్స అందించి.. తిరిగి జైలుకు పంపించారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెటర్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వార్నింగ్ ఇచ్చింది.
ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు వ్యవహారంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ మీడియా ఈ అంశంపై పాక్ క్రికెటర్ల నుంచి స్పందనలు రాబట్టేందుకు ప్రయత్నించడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు లంచ్ విరామ సమయంలో స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఓ ఇంటర్వ్యూ ఈ వివాదానికి కారణమైంది. ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులేమాన్తో ప్రముఖ మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మైక్ అథర్టన్ నిర్వహించిన ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసింది. దీంతో పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు ఈ ఇంటర్వ్యూను చూశారా? అని పాక్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ను మీడియా ప్రశ్నించింది. అయితే ఆటగాళ్లు లంచ్ చేస్తున్నారని, ఆ సమయంలో ఇంటర్వ్యూను చూడలేదని ఆయన స్పష్టం చేశారు. “లేదు.. దాని గురించి మాకు ఏమీ తెలియదు. మేమంతా లంచ్ చేస్తున్నాం” అని సర్ఫరాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో తెలిపారు. స్కై స్పోర్ట్స్ ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే లంచ్ తర్వాత మైదానంలోకి జట్టును పంపబోమని పీసీబీ హెచ్చరించిందన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు. ఆయన మాజీ సహచరుడు, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కూడా ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని అధికారులను కోరారు. ఇమ్రాన్ చాలా నిజాయితీపరుడైన వ్యక్తి అని పేర్కొంటూ ఆయన భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.
స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఇంటర్వ్యూ రాజకీయ స్వభావం కలిగి ఉండటంతో PCB అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే సెప్టెంబర్ 2న పాకిస్థాన్ జట్టుకు ప్రిన్స్ చార్లెస్ ఇవ్వనున్న విందు, అలాగే బ్రిటన్తో ఉన్న దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని మరింత వివాదంగా మార్చకుండా టెస్ట్ సిరీస్ను కొనసాగించాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం.
ఓటమి..
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో పాకిస్థాన్ తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్, 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్లోని మూడో టెస్ట్ సెప్టెంబర్ 9న బర్మింగ్హామ్లో ప్రారంభం కానుంది.
అడియాలా జైలులో ఇమ్రాన్
73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అవినీతి కేసుల్లో దోషిగా తేలిన అనంతరం ఆయనను జైలులో ఉంచారు. నిరంతర నిర్బంధం, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు కుటుంబ సభ్యులతో పాటు పలువురు మాజీ అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి విమర్శలకు దారితీశాయి.

