ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, ప్రపంచాన్ని కాపాడినందుకు గాను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లకు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, పాక్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్గా ప్రచారం చేస్తోంది.
ఏం జరిగిందంటే..?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని నివారించిందని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఈ ఇద్దరు నేతలు ఒక ‘నమ్మకమైన సమాచార దూత’గా పనిచేశారట. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడిన ఘనత అంతా పాకిస్థాన్దే అని వారు భుజాలు చరుచుకుంటున్నారు. లెబనాన్లో 250 మంది మరణించిన గంటల వ్యవధిలోనే ఈ డిమాండ్ రావడం గమనార్హం.
ఇస్లామాబాద్లో ‘శాంతి’ చర్చలు..
తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత.. ఏప్రిల్ 10న (శుక్రవారం) అమెరికా, ఇరాన్ ప్రతినిధులను తమ దేశానికి పిలిచి విందు ఇచ్చి చర్చలు జరుపుతామని షరీఫ్ గారు ఎక్స్లో (X) పోస్ట్ కూడా చేశారు. దీనికి ‘ఇస్లామాబాద్ టాక్స్’ అని పేరు కూడా పెట్టేసుకున్నారు. టర్కీ, ఈజిప్ట్, చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా చర్చలకు ప్రయత్నించినా.. క్రెడిట్ మాత్రం మాకే రావాలని పాక్ మీడియా ఆరాటపడుతోంది.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది..
సరే.. పాకిస్థాన్ ఇంతలా కష్టపడిందని అనుకుందాం.. కానీ నోబెల్ శాంతి బహుమతి కోసం అసలు యుద్ధాన్ని ఆపే గడువు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా? ఎక్కడైనా క్రెడిట్ దొరికితే ముందుండే ట్రంప్ మామ, ఈ శాంతి బహుమతిని పాక్ ప్రధానికి, ఆర్మీ చీఫ్కు ఎలా వదిలేస్తారు..? అసలే పాక్, ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ఆపినందుకు అప్పటి నుంచి శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
సొంత దేశంలో ఆర్థిక కష్టాలు, అప్పులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచ శాంతిని కాపాడామని ‘నోబెల్’ కావాలని అడగడం చూస్తుంటే.. వారి ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే నోబెల్ కమిటీ గనుక ఈ వార్తలు వింటే ఏమనుకుంటుందో కానీ, పాక్ మీడియా మాత్రం అప్పుడే షరీఫ్, మునీర్ల కోసం అవార్డు వేదికను సిద్ధం చేసేస్తోంది. మొత్తానికి.. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ‘మహావీరుల’ జాబితాలో తమ పేర్లు ఉండాలని పాక్ ఆశపడుతోంది. చూద్దాం.. నోబెల్ వస్తుందో లేదో..!