Samba : భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, గురువారం రాత్రి సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు తెగబడిన ఉగ్రవాదులకు భారత జవాన్లు నరకం చూపించారు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు జైషే మహమ్మద్కు చెందిన 10 నుంచి 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం చొరబాటు ప్రయత్నం మాత్రమే కాదు, పాకిస్తాన్ సైన్యం బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) చేసిన దుశ్చర్యగా అనుమానిస్తున్నారు. మరోవైపు, సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ గస్తీని ముమ్మరం చేసింది. రాత్రి 8 గంటల సమయంలో సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని భారత స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్ దాడులు కూడా మొదలయ్యాయి.
PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్లు కొనసాగింపు.. కానీ..
పాకిస్తాన్ సైన్యం భారత స్థావరాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండగా, ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధులైన ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు వారిని గుర్తించారు. ఉగ్రవాదుల ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ, పాకిస్తాన్ కాల్పులకు దీటుగా బదులిచ్చారు. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించగా, భారత జవాన్లు కాల్పులు ప్రారంభించారు.
ఉగ్రవాదులు చిక్కుకుపోయారని గ్రహించిన పాకిస్తాన్ సైన్యం కాల్పుల తీవ్రతను మరింత పెంచింది. అయినప్పటికీ, బీఎస్ఎఫ్ జవాన్లు ధీటుగా ప్రతిస్పందిస్తూ ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. ఇరువైపుల నుండి దాదాపు 40 నిమిషాల పాటు భీకరమైన కాల్పులు కొనసాగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు హతమయ్యారా లేక తిరిగి పారిపోయారా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే, వారిలో కొందరిని పాకిస్తాన్ భూభాగంలో పడిపోతున్నట్లు గుర్తించారు. వారి సంఖ్య 10 నుంచి 12 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సాంబా ప్రాంతం చొరబాటు పరంగా ఇదివరకే అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో గతంలో అనేక సొరంగాలు కూడా బయటపడ్డాయి.