Pakistan Hockey: ఆట ఏదైనా పాకిస్థాన్ టీమ్లు గమ్మత్తుగానే ఉంటాయి. ఆ దేశ కెప్టెన్సీలతోపాటు ఆ టీమ్లు, కోచ్లు తీసుకున్న నిర్ణయాలు ఇలా అన్నీ విచిత్రంగానే ఉంటాయి. తాజాగా మరో విచిత్రమైన వార్త వెలుగులోకి వచ్చింది. పాక్ టీమ్ల వివాదాలు అంటే ఎక్కువగా పాక్ క్రికెట్ టీమ్లు గుర్తుకు వస్తాయి. కానీ.. పాకిస్థాన్ హాకీ జట్టులో వివాదం తలెత్తింది.. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ అమ్మాద్ షకీల్ బట్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ హాకీ సమాఖ్య అతనిపై రెండు సంవత్సరాల నిషేధం విధించింది. ఒకవైపు విదేశీ పర్యటనలో వరుస పరాజయాలు, మరోవైపు ఆటగాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Viral Drum Guitar: ఎవరన్నా నువ్వు.. ఇంత టాలెంటడ్గా ఉన్నావ్! వైరల్ అవుతున్న మ్యూజిక్ వీడియో..
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు మైదానంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా, జర్మనీ జట్ల చేతిలో ఓటములు చవిచూసింది. కానీ అసలు సమస్య మ్యాచ్లలో కాకుండా, ఆటగాళ్లు ఎదుర్కొన్న అవ్యవస్థల వల్లే వెలుగులోకి వచ్చింది. హోబార్ట్ వెళ్లే ముందు సిడ్నీ విమానాశ్రయంలో జట్టు దాదాపు పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు చిక్కుకుపోయిందట. హోటల్ బుకింగ్ రద్దు కావడంతో ఆటగాళ్లు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక ఏర్పాట్లలోనే గంటల తరబడి గడపాల్సి వచ్చిందట.
READ MORE: Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
లాహోర్కు తిరిగొచ్చిన తర్వాత కెప్టెన్ అమ్మాద్ బట్ ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు. పర్యటనలో ఆటగాళ్లతో వంటగది శుభ్రం చేయించారని, పాత్రలు కడగమని బలవంతం చేశారని ఆరోపించాడు. జట్టు పంపిన వీడియోలు నిజమని వెల్లడించాడు. ఈ వీడియోలు విడుదలైన తర్వాత జట్టుపై ఒత్తిడి తీసుకువచ్చారని కెప్టెన్ తెలిపాడు.. ఈ వ్యాఖ్యలను సమాఖ్య తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించింది. బోర్డుపై బహిరంగంగా ఆరోపణలు చేయడం సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించిందని వాదిస్తూ అతనిపై రెండు సంవత్సరాల నిషేధం విధించింది. వివాదం పెద్దదవడంతో సమాఖ్య అధ్యక్షుడు తారిక్ బుగ్టీ తన పదవికి రాజీనామా చేశాడు. అర్జెంటీనా పర్యటనకు సంబంధించిన హోటల్ చెల్లింపులు ఆలస్యమైనందుకు పాకిస్థాన్ క్రీడా మండలి కారణమని స్పష్టం చేశాడు. వనరులు తక్కువగా ఉన్నప్పటికీ హాకీ అభివృద్ధికి తాను కృషి చేశానని చెప్పాడు. మొత్తం వ్యవహారంపై నిజాలు బయటపడేలా విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కోరాడు.
