Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ జవాన్ల పేర్లను తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు. ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో ఈ ఆరుగురు అమరవీరుల వివరాలను చేర్చారు. వీరిలో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ ఉండగా.. భారత వైమానిక దళం (IAF) నుంచి సర్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు.
గత 2025 సంవత్సరంలో వివిధ సైనిక చర్యల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల జ్ఞాపకార్థం ఆర్మీ వార్ మెమోరియల్ రూపొందించిన ‘రోల్ ఆఫ్ ఆనర్’ (2025) జాబితాలో ఈ ఆరుగురు వీరుల పేర్లను చేర్చారు. సైనిక సంప్రదాయం ప్రకారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్లోని స్మారక ఇటుకలపై వీరి పేర్లను త్వరలోనే చెక్కనున్నారు. దేశ రక్షణ కోసం వారు ప్రదర్శించిన అసాధారణ సాహసానికి గానూ ఇద్దరు జవాన్లకు కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్కు మరణానంతరం ‘వీరచక్ర’, సర్జెంట్ సురేంద్ర కుమార్కు ‘వాయుసేన మెడల్’ లభించాయి. జూన్ 8న రాష్ట్రపతి భవన్లో జరిగిన రక్షణ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్ తల్లిదండ్రులు ఈ వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది పాకిస్థాన్తో జరిగిన ఈ పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గుర్తింపును భారత్ అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి.
ఆపరేషన్ సిందూర్ వెనుక అసలు కథ:
గత 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భీకర వైమానిక, సైనిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదసిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో సహా దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం విజయవంతంగా మట్టుబెట్టింది. భారత సైన్యం దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకున్న పాకిస్థాన్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ద్వారా శాంతి చర్చలు కోరింది. దీంతో ఇరుదేశాల డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల అనంతరం 2025 మే 10 నుంచి సరిహద్దులు, గగనతలంలో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

