జగన్ 2.oలో పాదయాత్ర ఎలా ఉండబోతోంది? గతంలోని ప్రజాసంకల్ప యాత్రకు కొత్త ప్లాన్కు ఉన్న తేడాలేంటి? ఈసారి ఎన్నివేల కిలోమీటర్లు నడవాలనుకుంటున్నారు జగన్? ఆ విషయంలో ఎప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది? ఎప్పుడు యాత్ర మొదలుపెట్టబోతున్నారు? 2029 ఎన్నికల టార్గెట్గా ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ… ఏడాదిలోనే బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పార్టీ లీడర్స్, కేడర్ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు అధ్యక్షుడు జగన్. ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడు పరిస్థితిని చూసిన చాలామంది… వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని లెక్కలేశారు. అలాగే… కీలక నేతలు పార్టీని వీడటం, ముఖ్య నాయకుల మీద వరుస కేసులు, అరెస్టులు.. జైళ్ల పరంపరతో…. ఆ లెక్కలు కరెక్టేనన్న అంచనాలు కూడా పెరిగాయి. కానీ.. అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట ప్రస్తుత పరిస్థితులు. ఏదైతే అదైంది.. చూసుకుందాం అన్నట్లుగా పార్టీ అధిష్టానం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్…వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ప్లీనరీ ఉంటుందని చెబుతున్నారట. ఆ తర్వాత 2027లో తన పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించటంతో కేడర్ అటెన్షన్ మొత్తం అటువైపు మళ్ళింది. జగన్ 2.o పాదయాత్ర ఎలా ఉండబోతోంది.. ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ముగిస్తారు… రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు సెంటిమెంట్ అండ్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వైయస్ రాజశేఖర్రెడ్డి దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని అందించడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి ఊపిరి అందించారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వయసుతో నిమిత్తం లేకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చారు. అటు 2018లో పాదయాత్ర చేసిన జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీని 151 సీట్లతో అధికారంలోకి తీసుకురాగలిగారు. చివరిగా…2023లో నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడానికి తనవంతు సహకారం అందించారు. ఇలా… ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరు సుదీర్ఘ పాదయాత్రలు చేసినా… ఆ తర్వాత వాళ్ళ పార్టీలు పవర్లోకి రావడం సెంటిమెంట్ అయిందంటున్నారు పరిశీలకులు. అందుకే ఇదే సక్సెస్ ఫార్ములాను మరోసారి అప్లయ్ చేయాలనుకుంటున్నారట జగన్. 2029 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా… ఆ భారీ కార్యక్రమంతో… క్షేత్రస్థాయికి వెళ్ళి పార్టీని ఎలక్షన్ మూడ్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుత పరాజయాన్ని ఓ ఎదురుదెబ్బలానే స్వీకరించిన జగన్.. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లదాకా నడిచిన జగన్….. ఈసారి ఏకంగా 5 వేల కిలోమీటర్లకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత పాదయాత్ర మీద దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకోసం ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పాదయాత్ర 2.0 ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ గత పాలనను, భవిష్యత్ హామీలను ప్రజలకు వివరించడం లాంటివే ప్రధాన లక్ష్యాలుగా ఉండవచ్చంటున్నారు. అయితే… ఆలోచనలు, ప్రణాళికలు బాగానే ఉన్నా…. వచ్చే నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం, శ్రేణులను కాపాడుకోవడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం వంటి అనేక సవాళ్లను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. వాటి సంగతి ఎలా ఉన్నా…ప్రస్తుతం పార్టీలో జగన్ పాదయాత్ర గురించే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి మొదలవుతుంది.. మొత్తం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తారు.. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిలాంటి అంశాలపై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్ళు చేసేస్తున్నారు పార్టీ నేతలు. గతంలో మాదిరిగా కడప జిల్లాలోని వైయస్సార్ ఘాట్ నుంచి మొదలు పెడతారా లేక మరో రూట్ సిద్ధం ఎంచుకుంటారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు వైసీపీ లీడర్స్. వీలైనన్ని ఎక్కువ నియోజకర్గాలు కవర్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు 2019 ఎన్నికలకు ముందులాగా… నవరత్నాలు వంటి బలమైన మ్యానిఫెస్టో సిద్ధం చేసి… పాదయాత్ర సందర్భంలోనే… వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆశించిన ఫలితం వస్తుందని లెక్కలు వేస్తున్నారట.. ఏది ఏమైనా రకొడితే… గట్టిగానే కొట్టాలన్నట్టుగా పార్టీ పెద్దల వైఖరి ఉందని మాట్లాడుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. మరి 2027 నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? జగన్ పాదయాత్ర 2.0 సక్సెస్ అవుతుందా లేదా అన్నది తేలాలంటే.. వేచి చూడాల్సిందే.