Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?

  • జిల్లా పార్టీ నేతలతో కలవడానికి ఇష్టపడని కేతిరెడ్డి సొంత నియోజకవర్గంలో యాక్టివ్‌, జిల్లా లీడర్స్‌కు దూరం అందరికీ గుడ్‌ మార్నింగ్‌, సత్యసాయి వైసీపీ లీడర్స్‌కు బ్యాడ్‌ మార్నింగ్‌ పార్టీ నేతల హంద్రీనీవా పర్యటనకు వెంకట్రామిరెడ్డి దూరం జిల్లా నేతలు కలిసి చేసిన ఏ కార్యక్రమంలోనూ కనిపించని ఎక్స్‌ ఎమ్మెల్యే ధర్మవరంలో పార్టీ ఆఫీస్‌ విషయమై గతంలో తోపుదుర్తితో విభేదాలు తోపుదుర్తి అనుచరుల వైఖరితో కేతిరెడ్డి డీప్‌గా హర్ట్‌ అయ్యారా? వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ వేదిక పంచుకోవడానికి ఇష్టపడటం లేదా?
Otr Kethireddy

Otr Kethireddy

Off The Record: రాజకీయ నాయకులు ఒకే పార్టీలో ఉన్నా.. అప్పుడప్పుడు పరస్పరం మాటలు అనుకోవడం సహజం. ఎక్కువ మంది వీటిని లైట్‌గా తీసుకుంటారు. లేదా క్షణికావేశంలో అప్పటికప్పుడు గొడవ పడినా.. మళ్లీ సర్దుకుంటారు. కానీ… కొద్ది మంది మాత్రం మాత్రం ఒక్క మాట అన్నా.. దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఆ తర్వాత వారితో కలిసి నడిచేందుకు కూడా ఇష్టపడరు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో కూడా ఇదే జరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లా పార్టీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదట. గత కొన్ని రోజులుగా ఆయన వాళ్ళతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్‌గానే తిరుగుతున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేతిరెడ్డికి మొదటి నుంచి… ఉదయం 6గంటలకే ప్రజల వద్దకు వెళ్లి గుడ్ మార్నింగ్ అంటూ పలుకరించడం అలవాటు. ఆ డైలాగ్‌తోనే… రెండు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయ్యారాయన. అయితే… ఇప్పుడు అదే కేతిరెడ్డి సొంత పార్టీ నాయకులకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెబుతున్నారంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి రాజకీయవర్గాలు. రెండు రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో హంద్రీనీవా కాలువ మీద జిల్లా నేతలు పాదయాత్ర చేపట్టారు.

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం చేపట్టింది. జిల్లా నేతలంతా కలిసి హంద్రీనీవా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా నేతలు యాత్ర నిర్వహించారు. అయితే ఈ యాత్రలో కేతిరెడ్డి కనిపించకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అంతే కాదు.. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారాయన. అలాగే… ఇటీవల పలు అంశాలకు సంబంధించి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రెస్ మీట్లు పెట్టినా, ఎస్పీని కలిసినా….ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. పోనీ…. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారా అంటే.. అలాంటిదేం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేతన్న నేస్తం డబ్బులు ఇవ్వలేదంటూ ఇటీవల ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారాయన. ఈ ర్యాలీకి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా చేస్తున్నారు. అలాంటి నాయకుడు…. మరి జిల్లా నేతలతో ఎందుకు కలిసి వెళ్లడం లేదంటే…. అందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది ఆయన సన్నిహితుల మాట. ధర్మవరానికి దగ్గరగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల వారి కోసం తాను ధర్మవరంలో పార్టీ ఆఫీస్‌ పెడతానని కొద్ది రోజుల క్రితం చెప్పారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. అది అందరికీ అనుకూలంగా ఉంటుందని అంటూ… ధర్మవరంలో సమస్యలపై కూడా స్పందిస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

కానీ… ఆ మాటలు కేతిరెడ్డికి మింగుడు పడలేదు. అందుకు చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారాయన. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అసలు అక్కడే పార్టీ ఆఫీస్‌ లేదు, పైగా ఆయన కార్యకర్తలతో మాట్లాడాలంటే కార్యాలయమే అవసరమా అంటూ చురకలంటించారు. ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి సోదరుడు ఒక కేసులో అరెస్ట్ అయితే వైసీపీనాయకులు ఆందోళనకు దిగారు. ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తో కలిసి కేతిరెడ్డి కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా అక్కడ ప్రకాష్ రెడ్డి అనుచరులు ….. కేతిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరోక్షంగా ప్రకాష్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారట. దీంతో వ్యక్తిగతంగా ఆరోపణలు చేసివారితో వేదిక పంచుకోవడం వెంకట్రామిరెడ్డికి ఇష్టం లేకనే… జిల్లా నేతలతో కలిసి వెళ్ళడం లేదని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పే …. కేతిరెడ్డి సొంత పార్టీ నేతలకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.