Site icon NTV Telugu

Off The Record: మౌనం వీడని ఆ జిల్లా వైసీపీ లీడర్స్.. భయమా? వ్యూహమా?

Otr Eg Ycp

Otr Eg Ycp

Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ బలహీనంగా ఉందన్న టాక్‌ పెరుగుతోంది. మా నాయకులు తెగించి బయటికి రాలేకపోతున్నారని పార్టీ కేడరే చెప్పుకుంటోందట. 2024 ఎన్నికల్లో ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పార్టీ. రెండేళ్ళు దగ్గరపడుతున్నా… ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు మౌనం వీడటంలేదు. ఏదైనా కార్యక్రమానికి అధినాయకత్వం పిలుపునిస్తే… ఆ కాసేపు హడావిడి చేసి వెళ్ళిపోతున్నారట. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఎవరి పరిధిలో వాళ్ళు ఆందోళనలు చేస్తుంటే… కొంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నారన్నది కేడర్‌ వాయిస్‌. ఒకవేళ ఎవరైనా వచ్చినా… అదేదో ఫంక్షన్‌కు వచ్చినట్టుగా కనిపించి మమ అనిపించి వెళ్ళిపోతున్నారట. అదే సమయంలో రెండు జిల్లాల అధ్యక్షులు కూడా నేతల్ని సమన్వయ పరచడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెల్లుబోయిన వేణు జిల్లా కేంద్రం రాజమండ్రి సిటీ నుంచి కార్యకలాపాలు నిర్వహించవలసి ఉండగా… అది వదిలేసి రూరల్ నియోజకవర్గంలోని తన ఆఫీస్‌ను నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు.

ఇక కోనసీమలో చిర్ల జగ్గిరెడ్డిది కూడా ఇదే పరిస్థితి. ఆయన సైతం జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని వదిలేసి కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఉన్న తన పార్టీ ఆఫీస్‌కే పరిమితం అవుతున్నారు. ఇక మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరమయ్యారని అంటున్నారు. అవసరమైనప్పుడు ఏదో… అలా… చుట్టపు చూపుగా వచ్చి వెళ్లుతున్నారట. ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, ఇజ్రాయిల్ వంటి వారు కూడా యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నది కార్యకర్తల మాట. అలా ఎందుకని అంటే…. జిల్లాలోని కొందరు నాయకులను టార్గెట్ చేసి అధికార పార్టీ నేతలు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే…. ఎవరికి వారు జాగ్రత్త పడుతూ ఉండవచ్చని అంటున్నారు. కేసులు పెట్టినా ఫర్వాలేదంటూ… రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దూకుడుగానే ముందుకు వెళ్తుండగా… కొందరు నాయకులు మాత్రం వాటికి భయపడి సైలెంట్‌గా ఉంటున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు నాయకులైతే…. కూటమి సీనియర్‌ లీడర్స్‌తో టచ్‌లో ఉంటున్నారట.

బంధుత్వాలు, స్నేహాలు అన్ని లింకుల్ని కలుపుకుంటూ… సేఫ్‌ జోన్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే… ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటినుంచే హడావిడి ఎందుకు, 2027 చివరి నుండి యాక్టివ్ అయితే సరిపోతుంది కదా అన్నది కొందరి ఉద్దేశ్యంగా చెప్పుకుంటున్నారు. అప్పుడే హడావిడి చేస్తే… వీలైనంత ఎక్కువగా చేతి చమురు వదలడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ ఉండబోదన్న ఉద్దేశ్యం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. పార్టీ కేడర్‌ చెక్కు చెదరకపోయినా… నాయకులు టచ్ మీ నాట్‌ అన్నట్టుగా ఉండటంతో ఎక్కడా హడావిడి కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. చెబుతున్నట్టుగా…. పార్టీ అధ్యక్షుడు జగన్‌ మళ్ళీ పాదయాత్ర చేపడితే ఉమ్మడి జిల్లా పార్టీలో తిరిగి జోష్‌ వస్తుందని మాట్లాడుకుంటున్నారు కార్యకర్తలు. ఇక కేడర్‌ బలం దృష్ట్యా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటే ప్రయత్నం జరుగుతోందట. కొందరు కింది స్థాయి నాయకులు గ్రామాల వారీగా సమన్వయం చేసుకునే ప్లాన్‌లో ఉన్నారట. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ జగన్‌ పాదయాత్ర మొదలైతేనే పార్టీకి ఊపు వస్తుందన్నది వైసీపీ వర్గాల వాయిస్‌.

Exit mobile version