NTV Telugu Site icon

Off The Record: చివరి నిమిషంలో ఆగుతున్న చేరికలు.. టి.బీజేపీలో ఏం జరుగుతోంది..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణ బీజేపీలో చేరికలకు సడన్‌ బ్రేకులు పడుతున్నాయి. ముందు అంతా బాగానే ఉందనుకుంటారు. పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకుంటారు. మరి కొద్ది గంటల్లో ఇక కాషాయ తీర్థం తాగేయడమేనని అనుకుంటున్న టైంలో తూచ్‌.. ప్రోగ్రామ్‌ వాయిదా పడిందంటారు. ఎందుకిలా…? అంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. ఎవరో వద్దన్నారు ఆగిపోయిందంటారు. మొన్న మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌, నిన్న చీకోటి ప్రవీణ్‌. ఇద్దరిదీ సేమ్‌ సీన్‌. పార్టీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకుని అర్థంతరంగా ఆగినవాళ్ళే. మరికొద్ది సేపట్లో బీజేపీ కండువా కప్పుకుంటారనగా.. ఆఖరు నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరికీ బ్రేకులు పడ్డాయి.

దీనికి పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అందుకు కారణం అన్నది ఇంటర్నల్ టాక్‌. కృష్ణా యాదవ్‌, చీకోటి ఇద్దరూ.. పూర్తి సన్నద్ధతతో మందీ మార్బలాన్ని వెంటేసుకుని స్టేట్‌ బీజేపీ ఆఫీస్‌ దగ్గరికి వచ్చాకే చేరిక ఆగిపోవడంపై పార్టీలో విస్తృత చర్చే జరుగుతోందట. వాళ్ళ చేరికను కొందరు నేతలు అంగీకరిస్తే.. మరికొందరు మాత్రం గత చరిత్ర దృష్ట్యా వద్దంటున్నారట. అలాంటప్పుడు ముందే పార్టీలో చర్చించి ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదన్నది క్వశ్చన్‌. సాధారణంగా చేరికల విషయంలో ప్రతి పార్టీకి కొన్ని పాలసీలు ఉంటాయి. వాటికి అనుగుణంగా చర్చించి కొత్త వాళ్ళను చేర్చుకుంటారు. బీజేకి కూడా అలాంటి వ్యవస్థే ఉంది. మరి.. ఇలాంటి వారి చేరికపై కోర్ కమిటీలో, సీనియర్స్‌తో ఎందుకు చర్చించలేదని పార్టీ నాయకులే అడుగుతున్నారు. అసలు.. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటివి రిపీట్‌ అవుతున్నాయని, ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. ఇటు పార్టీకి గాని, అటు చేరేవారికి గాని, ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

కారణం ఏదైనా.. పార్టీలోకి వస్తామన్న వారికి ముందు ఏమీ చెప్పకుండా.. తీరా వారు అంతా సిద్ధం చేసుకున్నాక, ఆఫీస్‌ గడప తొక్కాక తూచ్‌.. మిమ్మల్ని చేర్చుకోలేకపోతున్నామని చెప్పడం పిలిచి అవమానించినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు కొందరు నాయకులు. అదే సమయంలో మరో వాదన కూడా తెరమీదికి వస్తోంది. గత చరిత్ర సరిగాలేని వారిని చేర్చుకుంటే పార్టీ పై ప్రభావం పడుతుందని, వాళ్ళు చివరి క్షణంలో ఆగిపోతే జరిగే నష్టం కన్నా… చేరితే అయ్యే నష్టం ఎక్కువ అని, అందుకే దాన్ని గురించి అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది మరో వర్గం. చీకోటి ప్రవీణ్‌ చేరడంపై కొందరు నేతల నుంచి తీవ్ర స్థాయి వ్యతిరేకత వచ్చిందని, ఆయనకు కండువా కప్పితే… మేం బయటికి వెళ్ళిపోతామని కూడా వాళ్ళు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ ముఖ్య నేతలు ఆప్పటికప్పుడు చేరిక వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికైతే…రెండు సార్లు జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ఇలాంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని జనంలో బద్నాం అవకుండా జాగ్రత్త పడాలంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. లేదంటే… వీళ్ళింతే… అనుకుంటూ అభాసు పాలవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.