Off The Record: తెలంగాణ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. చాలా రోజుల నుంచి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. కానీ… పీటముడి మాత్రం విడిపోవడం లేదు. రెండు సూపర్ పవర్ సెంటర్స్ మధ్య అది ఎప్పటికప్పుడు బిగుసుకుంటూనే ఉంది తప్ప వ్యవహారం తేలే మార్గం కనిపించలేదు ఇన్నాళ్లు. రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలతో ఇప్పటికే పూర్తవ్వాల్సిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ…ఆగిపోయిందన్నది రాజకీయ వర్గాలమాట.రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు గులాబీ పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు. ఇటు అవకాశం దొరికినప్పుడల్లా BRS సర్కార్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు గవర్నర్. దీనికి మంత్రుల స్థాయిలో అధికార పార్టీ నేతలు కూడా గట్టిగానే బదులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కోటా సీట్ల భర్తీ ఇప్పట్లో ఉండదని ఫిక్సయ్యారట చాలా మంది బీఆర్ఎస్ నేతలు. కానీ… ఇప్పుడిప్పుడే తీరు మారుతున్న సంకేతాలు అందుతున్నాయట. రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదరబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
Read Also: Varahi Yatra 2nd Phase: రెండో దశ వారాహి యాత్ర అక్కడి నుంచే.. ఫైనల్ చేసిన జనసేనాని
రాష్ట్రపతి తెలంగాణ టూర్ సమయంలో గవర్నర్ తమిళి సై , సీఎం కేసీఅర్ మధ్య మాటలు కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో గతంలో మాదిరిగా రాజ్ భవన్…ప్రగతి భవన్ మధ్య సంబంధాలు మెరుగయ్యే దిశగా అడుగులు పడుతున్నాయా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ అదే నిజమై… అంతరాలు తొలిగిపోతే… మా నెత్తిన పాలు పోసినట్టేనని అనుకుంటున్నారట ఎమ్మెల్సీ ఆశావహులు. సానుకూల వాతావరణం పెరిగితే ముందుగా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ మీదే దృష్టి పెట్టే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా మబ్బులు తొలిగిపోవాలని మొక్కుకుంటున్నారట. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ అన్నది పెద్ద విషయం కాదు. ముందుగా అనుకున్న అభ్యర్థుల పేర్లు క్యాబినెట్లో పెట్టి ఆమోదిస్తారు. ఆ కాపీని గవర్నర్కు పంపడం, స్టాంప్ వేయించుకోవడం చకచకా జరిగిపోతాయి. కానీ…తెలంగాణలో మాత్రం విభేదాల కారణంగా అదే పెద్ద సమస్యగా కనిపిస్తోందట నాయకులకు. ఇప్పుడిక ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే…సమస్య తీరిపోయినట్టేనంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లి వచ్చిన గవర్నర్ తమిళ సై తీరుపై గులాబీ పార్టీ నేతలు గరం గరం గా ఉన్నారు. రెండు పవర్ సెంటర్స్ మధ్య అదే చివరి వివాదం అవుతుందన్న చర్చ మొదలైంది. పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.