Off The Record: రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కదలికలు మున్సిపల్ ఎన్నికల వేళ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ ఎలక్షన్స్ను తన పార్టీకి అప్రెంటీస్లా భావిస్తున్న కవిత…. సత్తా చూపాలనుకుంటున్నారట. అయితే… తన పార్టీకి సంబంధించి ఇంతవరకు విధివిధానాలు ఖరారవకపోవడంతో…. ప్రస్తుతానికి ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో తన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారట ఎమ్మెల్సీ. పార్టీ పెట్టబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించినా… ఇంతవరకు ముందడుగు పడలేదు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో… ఈ ఛాన్స్ మిస్ అవకూడదన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే… ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర నాయకులతో భేటీ అయి కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్తో అధికారికంగా పొత్తు పెట్టుకోబోతున్నామని, ఇది ఎన్నికల కూటమి మాత్రమే కాదని, భవిష్యత్తులో కూడా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారామె.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా.. ఉమ్మడిగా వ్యూహాలను రూపొందించబోతున్నామని కూడా క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ జాగృతి ఇప్పటి వరకు సాంస్కృతిక, సామాజిక సంస్థగా ఉంది. కానీ ఈసారి ఎన్నికల బరిలో దిగడం ద్వారా తన రాజకీయ బలాన్ని కూడా చాటాలనుకుంటున్నారు కవిత. అందుకే… ఇప్పటికే రాష్ట్రంలో కాస్తో కూస్తో పరిచయం ఉన్న సింహం గుర్తును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కొందరు అభ్యర్థులు ఫార్వార్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద పోటీ చేసి ఉన్నందున సింబల్ తేలిగ్గా రీచ్ అవుతుందని, తమ అభ్యర్థులకు ప్లస్ అవుతుందని ఎమ్మెల్సీ లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కూడా సమావేశం అయ్యారట కవిత. ఆ సందర్భంగానే…. రాజకీయ పార్టీ ఏర్పాటు సంబంధించిన విధి విధానాలు, ప్రచార వ్యూహాలపై చర్చించినట్టు తెలిసింది. ఒకవైపు పార్టీ ఏర్పాటు పనులు మొదలైన క్రమంలో వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి…. తన అసలైన బలాన్ని అంచనా వేసుకోవాలన్నది కవిత ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకు ఫార్వర్డ్ బ్లాక్ సింహం తనకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఇక్కడే సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. మొదట్నుంచి బీఆర్ఎస్ నేతగా బలమైన ముద్ర ఉన్న కవిత మున్సిపల్ ఎన్నికల బరిలోకి రావడంతో… ఆ ప్రభావం కారు పార్టీ మీద ఎంతవరకు ఉంటుందన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా, మహిళా నాయకత్వానికి ప్రతీకగా ఆమెకు బీఆర్ఎస్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఆ క్రమంలోనే తనకంటూ ఒక వర్గం ఏర్పాటైంది.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆమె నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తే…. బీఆర్ఎస్ కేడర్ ఎంతోకొంత ఇటువైపు చూసే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మీద కవిత ప్రచారం ప్రభావం ఉండవచ్చంటున్నారు. మహిళలు, యువతలో ఆమెకున్న మద్దతు స్థానిక ఎన్నికల్లో ఓట్లుగా మారవచ్చన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆమె చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమం విజయవంతమవడమే అందుకు ఉదాహరణ అంటున్నారు కొందరు. అదే సమయంలో ఆ ఆదరణ మొత్తం పోలింగ్ బూత్లో కనిపిస్తుందా? బీఆర్ఎస్ని కాదని బయటికి వచ్చిన కవిత మాటల్ని ఎంత వరకు నమ్ముతారన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి కొందరిలో. అటు కాంగ్రెస్, బీజేపీ కూడా… కుటుంబ రాజకీయాలనే అంశాన్ని మళ్లీ ప్రజల ముందుకు తెచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇలా… ఎవరి లెక్కలు, అంచనాలు ఎలా ఉన్నా….కవిత మున్సిపల్ ఎన్నికల బరిలో దిగడం మాత్రం బీఆర్ఎస్కు వార్నింగ్ సైనే అన్నది ఎక్కువ మంది మనసులో మాట. గులాబీ పార్టీలోని ఓ వర్గాన్ని దగ్గరికి తీయడం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం లాంటివి సంప్రదాయ కారు ఓటర్ల మీద ప్రభావం చూపవచ్చంటున్నారు. ప్రచార పర్వం మొదలయ్యాక గానీ… పూర్తిగా అవగాహనకు రాలేమంటున్నారు పరిశీలకులు.