Off The Record: తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు జంపింగ్ పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడు కాంగ్రెస్లోకి దూకుతారో… ఏమేం మార్పులు జరుగుతాయోనంటూ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. దీనికి ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ యాడ్ అయింది. కేవలం ఎమ్మెల్యేలే కాదు…. ఎమ్మెల్సీలు కూడా చెప్పుకోతగ్గ సంఖ్యలోనే జంపింగ్ జపాంగ్ల లిస్ట్లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి తాజాగా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో మొత్తం ఐదుగురు గులాబీ శాసనసభ్యులు హస్తం పార్టీలోకి వెళ్ళినట్టయింది. వాళ్ళ మీద అనర్హత వేటు వేయించాలన్న గట్టి పట్టుదలతో ఉంది కారు పార్టీ హైకమాండ్.
Read Also: Chiranjeevi on Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సక్సెస్పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
అదంతా వేరే స్టోరీ. ఇప్పుడు తాజాగా అందరి చూపులు మండలి వైపునకు మళ్ళుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా గట్టిగానే పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్పుల అంశం తెరపైకి రావడంతో జంపింగ్ ఎమ్మెల్సీలు ఎవరన్న చర్చ జరుగుతోంది. మండలిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉంది. 40 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో 28 మంది బీఆర్ఎస్ ప్రతినిధులే ఉన్నారు. వీళ్ళలో పలువురు కాంగ్రెస్తో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే… ఇందులోనూ షరతులు వర్తిస్తాయన్న సబ్జెక్ట్ ఇంకా ఆసక్తికరంగా మారింది. రెండేళ్ళ పదవీ కాలం మిగిలిఉన్న వాళ్ళతో కాంగ్రెస్ సంప్రదింపులు జరపడం లేదట. అంతకు మించి టెన్యూర్ ఉన్న వాళ్ళతో మంతనాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఉమ్మడి వరంగల్ ,ఖమ్మం,నల్గొండ జిల్లాలకు చెందిన వారితో కాంగ్రెస్ టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోయి… పరిస్థితులు సహకరిస్తే… అసలు బీఆర్ఎస్ శాసనమండలి పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకునే దిశగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం. అయితే పార్టీ మారేందుకు ఎంత మంది సుముఖంగా ఉన్నారన్నదాన్ని బట్టి ఆ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతకు గులాబీ పార్టీ పట్టుబడుతున్న క్రమంలో ఎమ్మెల్సీలు ఎందరు ముందుకు వస్తారన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.