Off The Record: ఏపీలో స్థానిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నో కాంప్రమైజ్, నో యునానిమస్… ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగాల్సిందే…చావో -రేవో జనంలోనే తేలాల్సిందేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది వైసీపీ అధిష్టానం. ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఈసారి టిక్కెట్ ఉండబోదని కూడా క్లారిటీగా చెప్పేశారు వైసీపీ అధ్యక్షుడు. దీంతో… లోకల్ వార్ ఓ రేంజ్లో ఉంటుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. రెండున్నరేళ్ళ కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది, మనకు పొలిటికల్ పిచ్ క్లియర్గా ఉందని నమ్ముతున్న ప్రతిపక్షం అది పురమైనా, పంచాయతీ అయినా సై అంటూ కాలు దువ్వుతోంది. అయితే… అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత ఎంతవరకు ఉందన్న చర్చలు కూడా మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకు సరిపెట్టుకోవడం ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ఆ రేషియో స్థానిక సంస్థలకు వర్తించదని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశారు. దీంతో JSP కోటా సీట్ల మీద ఆసక్తికరమైన చర్చ మొదలై…కూటమిలో కొత్త కుంపట్లు రాజుకోవడం అనివార్యంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
ఎన్నికల హామీల అమలు, కరవు పరిస్థితుల్లాంటివి ఎక్కడ వ్యతిరేక ప్రభావం చూపుతాయోనన్న ఆందోళన ఒకవైపు ఉండగా….సీట్ల దగ్గరకు వచ్చేసరికి అంతర్గత ఎత్తుగడలు ఎక్కడ కొంప ముంచుతాయోనన్న భయం సైతం జనసేన వర్గాల్లో ఉందట. దీంతో ‘ సెల్ఫ్ రెస్పెక్ట్ ‘ కు తగ్గకుండా సీట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా గ్లాస్ ఎమ్మెల్యేలు….ఆ దిశగా టీడీపీ ముందు కీలక ప్రతిపాదన పెట్టాలని తమ నాయకత్వాన్ని కోరబోతున్నారట. ఇక్కడ కొట్లాడి టిక్కెట్లు తీసుకోవడం ఒక ఎత్తైతే… ఆయా సీట్లలో టీడీపీ లీడర్స్ , కేడర్ నుంచి వంద శాతం సహకారం అందేలా చూసు కోవడం మరో ఎత్తు అన్న మాటలు వినిపిస్తున్నాయి జనసేన వర్గాల్లో. ఎంపీ, ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని…. ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న చాలా మంది టీడీపీ నాయకుల కంటే సీనియర్లు అయి ఉండి కూడా తమకు అవకాశాలు దక్కలేదని ఉమ్మడి విశాఖ జనసేన లీడర్స్ కొందరు బాధపడుతున్నారట. ఈ తరుణంలో బలం ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం ద్వారా అటు పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ఇటు నాయకత్వంలో కొత్త హుషారు వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే… ఆ దిశగా టీడీపీ స్థానిక నాయకత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం ఎంత వరకు లభిస్తుందన్న చర్చ జరుగుతోంది. టిక్కెట్లు దక్కని వాళ్లు, స్థానిక పరిస్థితులతో విభేదించేవాళ్ళు… ఇలా ఎక్కడికక్కడ లోకల్ ఇష్యూ మీదే ఆధారపడి ఉంటుంది వ్యవహారం. అందుకే… ఈ ముప్పును తప్పించుకునేందుకు జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రత్యక్షంగాగాని పరోక్షంగా గాని టీడీపీ లీడర్స్ పోటీకి రాకుండా చూడాల్సిన బాధ్యత టిడిపి అధిష్టానానిదేనని అంటున్నారు. ఆ విషయంలో గట్టిగా లేకుంటే… టీడీపీ రెబెల్స్ బరిలో దిగి ఎక్కడ తమ కొంప ముంచుతారోనని జనసేన నాయకులు భయపడుతున్నారట.
అందుకే ఆ విషయంలో కరాఖండీగా ఉండాలని జనసేన ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పూర్తిగా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ… ఇప్పుడు తాము తీసుకునే సీట్లలో కూడా అదే ఫార్ములా అప్లయ్ చేస్తే చాలని సలహా ఇస్తున్నారట. కుదిరితే మాకు సహకరించండి, లేదా కామ్గా ఉండండి. అంతే తప్ప సీటు దక్కలేదన్న అక్కసుతో కెలికేయవద్దంటూ టీడీపీ లోకల్ లీడర్స్కు జనసేన నాయకులు సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. సర్పంచి మొదలు కార్పొరే షన్ మేయర్ వరకు ప్రతి స్థానానికి జనసేన అభ్యర్ధుల జాబితాలను సిద్ధం చేయాలని, దానికి సంబంధించి రాబోయే వారం, పది రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. అంతకంటే ముందే ఎన్నికల సర్దుబాటుపై చర్చలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. పోటీ విషయంలో వైసీపీ క్లియర్గా ఉన్నందున ప్రతిపక్షాన్ని ఢీ కొట్టాల్సిన చోట టిడిపి వర్సెస్ జనసేనగా మారితే నవ్వుల పాలైపోవడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని, అందుకే ఏదైనాసరే… ముందే క్లారిటీగా మాట్లాడుకోవాలని భావిస్తున్నారట జనసైనికులు. ఆత్మాభిమానం పాయింట్ని ముందు పెట్టి జనసేన చేస్తున్న ప్రయత్నం ఎటువైపు దారితీస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.

