North Korea: కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఆదివారం ఉదయం వరుస బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి మరోసారి అలజడి సృష్టించింది. ఈ ఏడాది ఆ దేశం జరుపుతున్న ఆయుధ పరీక్షల్లో ఇది తాజాది కావడం గమనార్హం. తూర్పు ఉత్తర కొరియాలోని సిన్పో తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ధృవీకరించింది. ఈ ప్రయోగాలు ఉత్తర కొరియా తూర్పు తీరానికి సమీపంలోని సముద్రంలో పడి ఉంటాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇది నాలుగోసారి.
READ ALSO: Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?
అత్యవసర సమావేశానికి దక్షిణ కొరియా నిర్ణయం
ఉత్తర కొరియా కదలికలతో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని, అమెరికా – జపాన్లతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటున్నామని దక్షిణ కొరియా రక్షణ దళాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ‘జాతీయ భద్రతా మండలి’ (NSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా చర్యలపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి పరీక్షలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ కార్యకలాపాలను నిషేధించే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ప్యాంగ్యాంగ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని మండిపడింది.
గత వారం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఒక డిస్ట్రాయర్ (యుద్ధ నౌక) నుంచి జరిగిన క్షిపణి పరీక్షను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అణ్వస్త్రాలను “భారీగా విస్తరించడం” పై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రకటించారు. అణుదాడి సామర్థ్యాలను మెరుగుపరచడానికి సైన్యానికి కొత్త లక్ష్యాలను కూడా నిర్దేశించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ గత వారం మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఉత్తర కొరియాలోని అణు కేంద్రాలలో కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు తమ సంస్థ ధృవీకరించిందని ఆయన వెల్లడించారు. వరుస క్షిపణి ప్రయోగాలు, అణు సామర్థ్యాల పెంపుపై కిమ్ జోంగ్ ఉన్ ప్రకటనలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!
