Site icon NTV Telugu

LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..

Lpg

Lpg

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ సరఫరా అత్యంత స్థిరంగా కొనసాగుతోందని.. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పెరిగిన ఉత్పత్తి..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశీయ రిఫైనరీల నుంచి గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా 38 శాతం మేర పెరిగింది. ఇది డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను నిరంతరం కొనసాగించడానికి దోహదపడుతోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 94 శాతం గ్యాస్ బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా.. వినియోగదారులకు సౌకర్యవంతంగా మారింది.

దుర్వినియోగానికి అడ్డుకట్ట..
సిలిండర్ల పక్కదారి మళ్లింపును (Black marketing) అరికట్టేందుకు ప్రభుత్వం ‘డెలివరీ ఆథెంటికేషన్ కోడ్’ (DAC) విధానాన్ని కఠినతరం చేసింది. ఈ విధానం వినియోగం ప్రస్తుతం 76 శాతానికి పెరిగింది. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) తప్పనిసరి చేయడం ద్వారా అసలైన లబ్ధిదారులకే గ్యాస్ అందుతోంది.

Also Read:North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?

అక్రమాలను అరికట్టే క్రమంలో అధికారులు దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12,000కు పైగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 15,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

వినియోగదారులకు సూచనలు..
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. గ్యాస్ సిలిండర్ల నిల్వ తగినంతగా ఉందని.. బుకింగ్ చేసుకున్న తక్కువ సమయంలోనే డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Exit mobile version