Nitin Gadkari : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (మే 6) కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. గడ్కరీ ఉదయం 9 గంటలకు నాగ్పూర్ ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టరులో బయలుదేరి, 10:15కి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ చేరుకుంటారు. అక్కడ 10:30 నుంచి 11:30 వరకు రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు పర్యటిస్తారు. అక్కడి నుంచి BHEL, అంబర్పేట్ ప్రాంతాల్లోని ప్రధాన ఫ్లైఓవర్లను సందర్శించి ప్రారంభిస్తారు.
కాగజ్నగర్ వద్ద ప్రారంభించే కీలక ప్రాజెక్టులు:
నిర్మల్–ఖానాపూర్ మార్గంలో 17.79 కిమీ రోడ్డు వెడల్పు పనుల పూర్తి
మంచిర్యాల్–రేపల్లెవాడ మధ్య 42 కిమీకి రూ. 2,001 కోట్లతో నాలుగు లేన్ మార్గం
రేపల్లె–మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కిమీకి రూ. 1,525 కోట్లతో మార్గం అభివృద్ధి
కడ్తాల్ వద్ద రూ. 23.54 కోట్లతో 6 లేన్ అండర్పాస్
నాగ్పూర్–హైదరాబాద్ సెక్షన్ లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పు
హైదరాబాద్ లో ప్రారంభించనున్న ప్రాజెక్టులు:
అంబర్పేట్ ఫ్లైఓవర్ (1.47 కిమీ, రూ. 415 కోట్లు)
ఆరాంఘర్–శంషాబాద్ మధ్య 10 కిమీకి 6 లేనింగ్ ప్రాజెక్ట్ భూమిపూజ
మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్, జాప్తి శివనూర్, గోల్డెన్ ధాబా Y జంక్షన్ వద్ద అండర్పాస్లు
కామారెడ్డి జిల్లా టెక్రియాల్, పొందుర్తి, పద్మాజివాడ జంక్షన్లలో అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు
ఆలేరు-జీడికల్ X రోడ్స్ వద్ద 6 లేన్ అండర్పాస్ (హైదరాబాద్–వరంగల్ సెక్షన్)
BHEL జంక్షన్ వద్ద రూ. 172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
అంతేకాకుండా, రూ. 657 కోట్ల విలువ గల 21 కిమీ పొడవు ఉన్న 7 ప్రాజెక్టులకు గడ్కరీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేయనున్నారు.