Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: “ఎవడైనా కులం గురించి మాట్లాడితే వాడికి గట్టిగా తన్నులు పడతాయి” (జో కరేగా జాత్ కీ బాత్, ఉస్కో మారుంగా కస్ కే లాత్) అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాజాగా నాగ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని కులమతాల పేరుతో విభజించే రాజకీయ నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, ఎవడైనా కులం గురించి మాట్లాడితే వాడికి గట్టిగా తన్నులు పడతాయంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. అభివృద్ధికి కులమతాలు ఉండవని, ప్రభుత్వం అందించే గ్యాస్, పెట్రోల్ లేదా డీజిల్ వంటి సౌకర్యాలు హిందువులకు ఏ ధరకైతే లభిస్తాయో, ముస్లింలకూ అదే ధరకు అందుతాయని గుర్తుచేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నప్పుడు, ఈ కుల రాజకీయాలతో ఒరిగేదేమీ లేదని కుండబద్దలు కొట్టారు.

ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను సైతం గడ్కరీ ఎండగట్టారు. వేదికలపై కులాల గురించి ఊదరగొట్టే కొందరు నేతలు, వ్యక్తిగతంగా తనను కలిసినప్పుడు మాత్రం తమ భార్యలకో, కొడుకులకో రాజకీయ టిక్కెట్లు ఇప్పించమని అడుగుతుంటారని, ఇలాంటి దొంగ వేషాలు వేసే నాయకులను ప్రజలు ఇప్పటికే గుర్తించారని విమర్శించారు. తాను ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతానని, తాను చెప్పిన పనిని చేయలేదని ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల గురించే కాకుండా, దేశ నిర్మాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ప్రశంసించారు. భారతదేశ ప్రగతి కేవలం యంత్రాల వల్ల సాధ్యం కాలేదని, దేశంలోని లక్షలాది మంది కార్మికుల రక్తం, చెమట వల్లనే ఈ అద్భుతమైన రహదారులు, భవనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశాభివృద్ధికి వెన్నెముక వంటి కార్మికులకు సరైన గౌరవం, అవకాశాలు కల్పించడం ద్వారానే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.