NTV Telugu Site icon

Duvvada Family Issue: మీడియా ముందు ఎమ్మెల్సీ దువ్వాడకు మాధురి ఫోన్‌.. ఇంటి రిజిస్ట్రేషన్‌పై క్లారిటీ

Divvala Madhuri

Divvala Madhuri

Duvvada Family Issue: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. నేడు మీడియా ముందుకు వచ్చిన దివ్వల మాధురి.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసింది. ఈ క్రమంలో ఇంటి రిజిస్ట్రేషన్‌పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రూ.2కోట్లు అప్పు ఉన్నానని.. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతికి రూ.60 లక్షలు ఇవ్వాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నా వ్యాపారాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తన ఆస్తిని మనస్పూర్తిగా మాధురికి రిజిస్ట్రేషన్‌ చేశానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ప్రెస్‌మీట్ పెట్టి చెబుతానన్నారు.

Read Also: ACA President: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక

తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదని దివ్వల మాధురి వ్యాఖ్యానించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని అన్నారు. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్‌ను సృష్టించారని.. దువ్వాడ వాణినే ఈ వాయిస్ రికార్డు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. శనివారం తనపై హత్యాయత్నం చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివ్వల మాధురి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు, ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్‌కు అద్దెకు ఇస్తానన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి ,కుమార్తెలు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారన్నారు. ప్రస్తుతం ఇంటిని స్వాధీన పరుచుకున్నానని దివ్వల మాధురి స్పష్టం చేశారు.