New Income Tax Law: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.. సరికొత్త నిబంధనలకు స్వీకారం చుట్టింది.. దేశంలో పన్నుల వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ, 1961 నాటి ఆదాయపు పన్ను చట్టానికి ముగింపు పలికింది. దాని స్థానంలో కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, మరియు డిజిటల్ ప్రాసెస్ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చట్టం తీసుకురాబడింది. ఈ కొత్త చట్టంతో పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన అనేక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైన 10 మార్పులు ఇవి.
1. పన్ను సంవత్సరం: మొదటగా, పన్ను వ్యవస్థలో ఉపయోగించే పదజాలంలో మార్పు చేశారు. ఇప్పటివరకు వాడుతున్న ఆర్థిక సంవత్సరం (FY), మదింపు సంవత్సరం (AY) అనే పదాలను తొలగించి, వాటి స్థానంలో ‘పన్ను సంవత్సరం’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల పన్ను దాఖలు ప్రక్రియ మరింత సులభమవుతుందని భావిస్తున్నారు.
2. ఐటీఆర్ గడువు: ఐటీఆర్ దాఖలు గడువుల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్కు జూలై 31 గడువు అలాగే కొనసాగుతుండగా, ఐటీఆర్-3, ఐటీఆర్-4 కోసం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. దీని వల్ల వ్యాపారులు, ప్రొఫెషనల్స్కు కొంత ఉపశమనం లభిస్తుంది.
3. ఎఫ్ అండ్ వో ట్రేడర్లపై అధిక పన్నులు: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి కొత్త పన్ను భారాలు పెరిగాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచారు. దీనివల్ల ట్రేడింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
4. హెచ్ఆర్ఏ క్లెయిమ్ల కోసం నియమాలు: ఇంటి అద్దె భత్యం (HRA) క్లెయిమ్ చేసుకునే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఉద్యోగులు ఇప్పుడు ఇంటి యజమాని PAN వివరాలు, అద్దె రసీదులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, 50 శాతం HRA మినహాయింపు వర్తించే నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలను కూడా చేర్చారు.
5. మీల్ కార్డులపై పన్ను రహిత పరిమితి: కంపెనీలు ఇచ్చే మీల్ కార్డులపై పన్ను మినహాయింపు కూడా పెరిగింది. భోజనానికి ఉన్న రూ.50 పరిమితిని రూ.200కు పెంచారు. ఇది ఉద్యోగులకు కొంత ప్రయోజనం కలిగిస్తుంది.
6. గిఫ్ట్ వోచర్స్ అండ్ కూపన్లపై రాయితీలు: గిఫ్ట్ వోచర్లు, కూపన్లపై పన్ను రహిత పరిమితిని కూడా రూ.5,000 నుండి రూ15,000కు పెంచారు. ఈ ప్రయోజనం పాత మరియు కొత్త పన్ను విధానాల్లో రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
7. విద్యా భత్యం మినహాయింపు: పిల్లల విద్యా భత్యంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. ఒక్కో బిడ్డకు నెలకు రూ.100గా ఉన్న విద్యా భత్యాన్ని రూ.3,000కు, హాస్టల్ భత్యాన్ని రూ.300 నుండి రూ.9,000కు పెంచారు. ఇది కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించే అంశం.
8. షేర్ బైబ్యాక్లపై ప్రత్యేక పన్ను: షేర్ బైబ్యాక్లపై పన్ను విధానం కూడా మారింది. ఇకపై ఇవి డివిడెండ్గా కాకుండా మూలధన లాభాలుగా పరిగణించి పన్ను విధిస్తారు. దీని వల్ల కొంతమంది పెట్టుబడిదారులకు పన్ను భారం పెరిగే అవకాశం ఉంది.
9. పాన్ నిబంధనలలో మార్పులు: పాన్ కార్డ్ నిబంధనల్లో కూడా కీలక మార్పులు వచ్చాయి. ఇకపై ఆధార్ మాత్రమే సరిపోదు, అదనపు పత్రాలు అవసరం అవుతాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్లు, వాహనాల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేశారు.
10. ఆదాయపు పన్ను ఫారాలు: చివరగా, ఆదాయపు పన్ను ఫారాల పేర్లలో కూడా మార్పులు చేశారు. ఫారం 16 స్థానంలో ఫారం 130, ఫారం 16A స్థానంలో ఫారం 131 వంటి కొత్త పేర్లు ప్రవేశపెట్టారు. అయితే వాటి విధుల్లో పెద్దగా మార్పులు లేవు. మొత్తానికి, ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం పన్ను వ్యవస్థను సులభతరం చేయడమే కాకుండా, పారదర్శకతను పెంచే దిశగా ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ మార్పులను తెలుసుకుని ముందుగానే తమ ఆర్థిక ప్రణాళికను సవరించుకోవడం మంచిది.