Nepal Floods: నేపాల్లోని రసువా ప్రాంతంలో భోటేకోషి, త్రిశూలి నదులు వినాశకరమైన ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే పదలు సంఖ్యలో జనాలు మృతి చెందగా.. వందల సంఖ్యలో గల్లతయ్యారు. అయితే.. ఈ వారదల్లో తెలుగు వాళ్లు కూడా మిస్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. కైలాస మానసరోవర్, నేపాల్ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ గల్లంతు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా మొత్తం 156 మంది తెలుగు యాత్రికులు ఈ పర్యటనకు వెళ్లగా, వారిలో 140 మంది ఆచూకీ లభించడం లేదు.
వరద ఉద్ధృతికి నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పర్యటన కోసం బయటకు వెళ్లిన 140 మందితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో వారి పరిస్థితిపై స్పష్టత కరవైంది. అయితే, అనారోగ్యం కారణంగా గదుల్లోనే ఉండిపోయిన 16 మంది యాత్రికులు ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కంటికి రెప్పలా చూసుకునే తమ వారు సుదూర ప్రాంతంలో గల్లంతయ్యారని తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఘటన తెలుసుకున్న ఇండియన్ ఎంబసీ వెంటనే రంగంలోకి దిగింది. నేపాల్ భద్రతా దళాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా విస్తృతంగా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేసింది. యాత్రికుల కుటుంబీకులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం, సహాయం కోసం నేపాల్ ఎంబసీ హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. గల్లంతైన 140 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగిరావాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

