Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?

NEET RE Exam

NEET RE Exam

లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను, వారి రక్తాన్ని, చెమటను గాల్లో కలిపేస్తూ పేపర్ లీక్ చేసినప్పుడు ఈ విద్యావ్యవస్థ ఎక్కడికి పోయింది? ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 23 లక్షల మంది విద్యార్థులను నెలల తరబడి తీవ్ర ఆందోళనలోకి నెట్టేసి, మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని ‘రెండో అవకాశం’ ఇవ్వవచ్చు. కానీ, అదే విద్యార్థి రోడ్డు మీద ట్రాఫిక్ వల్లో, వర్షం వల్లో, బైక్ పంక్చర్ కావడం వల్లో కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే గేట్లు మూసేస్తారా? ఇది క్రమశిక్షణా? లేక వ్యవస్థలోని నిర్లక్ష్యపు అహంకారమా?

పేపర్ లీక్ అయితే క్షమాపణ.. రెండు నిమిషాలు లేట్ అయితే శిక్షా?
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షను సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేసిన అధికారులపై తక్షణ చర్యలు లేవు. విద్యాశాఖ మంత్రికి, ప్రభుత్వానికి పేపర్ లీకులను అరికట్టడానికి సమయం దొరకలేదు కానీ, తప్పు దిద్దుకోవడానికి మాత్రం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష పెట్టే అధికారం దొరికింది.

×
×
Ad

తమ తప్పు ఏమీ లేకపోయినా నెల రోజులుగా నరకం అనుభవించి, మళ్లీ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై మాత్రం ‘ఒక్క నిమిషం’ నిబంధనను కఠినంగా ప్రయోగించారు. ఇదా మీ న్యాయం? పేపర్ లీక్ చేసి లక్షలాది మంది భవిష్యత్తును నాశనం చేసిన వ్యవస్థకు లభించిన క్షమాపణ… ఊహించని ప్రమాదాల వల్ల రెండు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థికి ఎందుకు లభించలేదు?

నిబంధనల ముసుగులో మానవత్వం లేని మృగాలుగా మారుతున్నారా..?
మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఒక విద్యార్థిని వర్షం, బైక్ పంక్చర్ కారణంగా కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అధికారులు లోపలికి రానివ్వకపోవడంతో, ఆ కన్నతండ్రి పరీక్షా కేంద్రం బయట రోడ్డుపై పడి ఏడ్చిన ఏడుపు ఈ మొద్దుబారిన వ్యవస్థకు వినపడలేదా..? అధికారులు కనికరించి లోపలికి పంపినా… అప్పటికే బయోమెట్రిక్ సిస్టమ్ లాక్ అయిపోయిందనే సాంకేతిక సాకుతో ఆమెను పరీక్ష రాయనివ్వలేదు.

తెలంగాణలోని జగిత్యాలలో ఒక తల్లి తన కూతురి భవిష్యత్తు కోసం అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి ప్రాధేయపడింది. బెంగళూరులో ముగ్గురు విద్యార్థినులు రాజకీయ ర్యాలీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి, సమయానికి చేరలేక ఏడుస్తూ కాలేజీ గోడలు ఎక్కి దూకినా లోపలి గేట్లు వేసి వారిని వెనక్కి పంపేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒకటి స్పష్టమవుతోంది.. మన విద్యావ్యవస్థ నడుపుతోంది మనుషులు కాదు, మానవత్వం లేని యంత్రాలు అని.

ఈ ‘లేట్ నిబంధన’ వల్ల ఎవరికి లాభం?
పరీక్షను కచ్చితమైన సమయానికి నిర్వహించడం, నిబంధనలు పాటించడం అవసరమే. కానీ ఆ నిబంధనలు విద్యార్థుల జీవితాలను నిర్వీర్యం చేయడానికి కాదు, సాయపడటానికి ఉండాలి.

ఒక మధ్యేమార్గం లేదా?: ఢిల్లీలోని ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష ముగిసిన అరగంట తర్వాత బయటకు వచ్చారు. ఎందుకంటే, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పరీక్ష ముగిసిన తర్వాత పూర్తి చేశారు. మరి ఈ పద్ధతిని దేశమంతటా ఎందుకు వర్తింపజేయలేదు?

ఒక విద్యార్థి 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే, ఆ 10 నిమిషాల సమయాన్ని అతనికి తగ్గించి, మిగిలిన సమయంలో పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. సమయం కోల్పోవడం అనేది అతనికి శిక్ష అవుతుంది, కానీ ఏకంగా పరీక్షే రాయనివ్వకుండా ఒక పూర్తి సంవత్సరాన్ని, వారి జీవితకాల కష్టాన్ని తుడిచిపెట్టడం ఏ రకమైన న్యాయం?

CBSE, ICSE వంటి బోర్డు పరీక్షల్లో కూడా విద్యార్థులకు 15 నిమిషాల వరకు మినహాయింపు ఇస్తారు. ఎందుకంటే రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలైనా జరగొచ్చని వారికి తెలుసు. కానీ నీట్ రీ-టెస్ట్‌లో మాత్రం అధికారులు రోబోల్లా ప్రవర్తించారు.

మంత్రులకు, అధికారులకు లేని క్రమశిక్షణ కేవలం విద్యార్థులపైనే రుద్దుతారా? కాగితాల మీద ఉండే నిబంధనలు మనుషుల జీవితాల కంటే గొప్పవి కావు. ఒక వ్యవస్థ తన చేతకానితనం వల్ల జరిగిన తప్పు కోసం లక్షలాది మంది విద్యార్థులను నెల రోజులు వేచి ఉండేలా చేసినప్పుడు, అదే వ్యవస్థ ఒక విద్యార్థి కోసం రెండు నిమిషాలు వేచి ఉండలేదా? ఇది క్రమశిక్షణ కాదు, అధికార మదం.. మానవతా రాహిత్యం. నిబంధనల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో, వారి మానసిక ఆరోగ్యంతో ఆడుకునే ఈ విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఈ దేశంలో ప్రతిభ కాదు… కేవలం వ్యవస్థలోని లోపాలు, అహంకారాలు మాత్రమే గెలుస్తాయని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.