NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!

  • నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
  • మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం
Neet Paper Leak Sfi

Neet Paper Leak Sfi

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమానికి ముందు నుంచే పోలీసులు పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆరోపించారు.

కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ నిర్వహించే కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం.. ఎస్ఎఫ్ఐ చేపట్టే నిరసనలకు మాత్రం అనుమతి నిరాకరించి రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం అన్యాయమని నాగరాజు విమర్శించారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు లోక్ భవన్‌ను ముట్టడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రెగ్యులేషన్ కమిటీ తనిఖీలు నామమాత్రంగా మారాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. బి-కేటగిరీ సీట్లను యాజమాన్యాల ఇష్టారాజ్యంగా కాకుండా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు.

బి-కేటగిరీ సీట్ల పేరుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. అంతేకాకుండా ల్యాబ్, వాన్, జేఎన్‌టీయూ, అటెండెన్స్ తదితర పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొంది. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డొనేషన్లు వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్ చేయాలని, వాటిపై ఏసీబీ, ఆదాయపన్ను శాఖలతో దాడులు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాక బి-కేటగిరీ సీట్లను పూర్తిగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది.