NEET Aspirant Suicide: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ విజయ్నగర్ పరిధిలో గుండెల్ని పిండేసే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న జతిన్ కుమార్ అనే 22 ఏళ్ల విద్యార్థి మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. జతిన్ తన తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక్క కుమారుడు. కాగా, అతని తండ్రి రాజేష్ కుమార్ సహారన్పూర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న జతిన్కు 2026 మే నెలలో జరిగిన నీట్ పరీక్ష ఐదో ప్రయత్నం. ఆ పరీక్ష ముగిసినప్పటికీ, మళ్లీ జరగబోయే నీట్ పరీక్ష కోసం అతను విజయ్నగర్ సెక్టార్-9లోని తన గదిలో ఉంటూ తిరిగి ప్రిపరేషన్ సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని నిద్ర లేపడానికి గదిలోకి వెళ్లేసరికి జతిన్ నిర్జీవంగా ఫ్లోర్పై పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. ఉరివేసుకున్న సమయంలో ఫ్యాన్కు కట్టిన తాడు తెగిపోవడంతో మృతదేహం కింద పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సిటీ కొత్వాలీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఉపాసన పాండే, విజయ్నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ దర్యాప్తులో జతిన్ మొబైల్ ఫోన్ను పరిశీలించగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతను రికార్డ్ చేసిన ఒక నిమిషం ఐదు సెకన్ల నిడివి గల భావోద్వేగ భరిత వీడియో లభ్యమైంది. ఆ వీడియోలో ఫ్యాన్కు వేసిన ఉరితాడును చూపిస్తూ.. “నాన్నగారేమో అస్సలు టెన్షన్ పడొద్దని చెబుతున్నారు, నిజానికి నాకు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. కానీ, వీటన్నింటి వల్ల నా మనసు పూర్తిగా విసిగిపోయింది. నేను జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నాను” అంటూ జతిన్ తన చివరి మాటలను రికార్డ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి నిరాకరించారు.

