MS Dhoni: టీమిండియాలో కెప్టెన్ల తొలగింపు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వారి ఫిట్నెస్, తదితర సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్స్ను బాధ్యతల నుంచి పక్కన పెడుతుంటారు. 2025లో భారత క్రికెట్లో రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ మార్పు అనంతరం పెద్ద దుమారమే రేగింది. 2017లోనూ ఎంఎస్ ధోనీని కెప్టెన్ నుంచి తొలగతించి విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అయితే ఆ మార్పు ఎలా జరిగిందన్న విషయంపై తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎస్ ధోనీ (MS Dhoni) 2014లోనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకున్నాడు. కానీ 2017లో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా బాధ్యతలు విరాట్ కోహ్లీకి (Virat Kohli)కి అప్పగించారు. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకోలేదు. భారత క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (Board of Control for Cricket in India) సెలక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముందే ఆలోచించిందట.
READ MORE: Jailer2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!
అప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్న జతిన్ పరంజపే తాజాగా చెప్పిన వివరాల ప్రకారం.. తాను, అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ (MSK Prasad) కలిసి ధోనీతో మాట్లాడాలని నిర్ణయించారు. ధోనీ నెట్లో బ్యాటింగ్ చేస్తుండగా అక్కడికి వెళ్లారు. ధోనీతో మాట్లాడాలని కొంత సమయం వేయిట్ చేశారు. ఎలా మాట్లాడాలి? ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? అని ముందే ప్లానింగ్ చేశారట. చివరికి ధోనీ దగ్గరకు వెళ్లి, “ఇప్పుడు మార్పు చేయడానికి సరైన సమయం వచ్చిందని అనుకుంటున్నాం” అని కెప్టెన్సీ గురించి వివరించారు. అందుకు ధోనీ ఎలాంటి అసహనం చూపలేదట. వెంటనే, “ఇది సరైన నిర్ణయం. నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పండి” అని సమాధానం ఇచ్చాడట. కమిటీ తరఫున లిఖితపూర్వకంగా తప్పుకుంటున్నట్టు మెయిల్ పంపాలని చెప్పగా, ధోనీ అంగీకరించాడు. అదే రాత్రి “నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను” అని మెయిల్ పంపాడట. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయని జతిన్ పరాంజపే తెలిపారు. కానీ టీమ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని భావించామని చెప్పారు. అంతేకాదు, కోహ్లీకి పూర్తి మద్దతు ఇస్తానని ధోనీ హామీ ఇచ్చాడట. “విరాట్ నా తమ్ముడు లాంటి వాడు. నాకు ఉన్న అనుభవం అంతా అతనికి ఇస్తాను. మనం మంచి జట్టును నిర్మిద్దాం” అని ధోనీ చెప్పినట్టు వెల్లడించారు.
