రాజధాని రైతుల మహా పాదయాత్రకు విజయవాడ నుంచి ముస్లిం మైనార్టీలు భారీ వాహన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీని ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా ముస్లిం మైనార్టీలు బయలుదేరారు. అయితే.. ఈ ర్యాలీని కేశినేని నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ విజనరీ నాయకుడి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. అంతేకాకుండా.. చంద్రబాబు చేసిన అభివృద్ధి తాను చేయలేని అసమర్థుడనని ఒప్పుకునే 3 రాజధానులంటున్నాడని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టడం కోసమేనని ఆయన మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదని, ఒకే రాజధానిని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయించాలని విభజన చట్టం చెప్పిందన్నారు. అందుకనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణ వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల మహాపాదయాత్రకు కులమతాలకతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు రైతులకు ఉందని ఆయన వెల్లడించారు.
