NTV Telugu Site icon

Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ..

New Project (5)

New Project (5)

ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిని భాజపా ఖరారు చేసింది. మోహన్ మాఝీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఉప ముఖ్య మంత్రులుగా ఖరారు చేసింది. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి మోహన్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంన్నికయ్యారు. ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో కూడా కియోంజర్ అసెంబ్లీ స్థానాన్ని మాఝీ గెలుచుకున్నారు. బిజు జనతా దళ్‌కు చెందిన మినా మాఝీని 11,577 ఓట్లతో ఓడించారు. సీఎం ఎంపికను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌లను నియమించారు. రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్‌ మంగళవారం రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని రాజ్ నాథ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.

READ MORE: Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..

రాజ్ నాథ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మోహన్ మాఝీని ముఖ్యమంత్రిని చేయాలని చేతులెత్తి వారిలో మొదటగా కేవీ సింగ్ ఉన్నారు. తనను సీఎం చేయాలనే నిర్ణయాన్ని మిగతా ఎమ్మెల్యేలందరూ చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నారు. అందువల్ల ఒడిశా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మోహన్ మాఝీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.” అని పేర్కొన్నారు.

ఒడిశాలో మొత్తం 147 స్థానాలకు గాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి సొంతంగా మెజారిటీ పొందింది. ఒడిశా నుంచి ఆ పార్టీ ఎంపీగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ సీఎం చేయవచ్చని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయినా కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని చేశారు. దీని తరువాత, అందరి చూపు ఒడిశాపై పడింది. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చిన బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారి పేరు కూడా తెరపైకి వచ్చింది.