Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: PM Modi: రేపు ఛత్తీస్గఢ్లో మోడీ పర్యటన.. రాష్ట్ర దినోత్సవ వేడుకలకు హాజరు
మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అయితే, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీన్కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు.
READ MORE: Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
కాగా.. అజాహరుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.