Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?

Modi Xi Jinping1

Modi Xi Jinping1

Modi-Xi Jinping Bonding at BRICS Summit: ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య కనిపించిన అరుదైన సాన్నిహిత్యం. సుమారు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్, సమ్మిట్ వేదికగా మోడీతో పంచుకున్న క్షణాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపి, జిన్‌పింగ్ వైపు తిరిగారు. ఆయన ముఖంలో ఏదో అసౌకర్యం కనిపించడంతో మోడీ వెంటనే స్పందిస్తూ “ఈజ్ ఇట్ ఓకే?” అంటూ చైనా అధ్యక్షుడి అనువాదకుడిని ఆప్యాయంగా విచారించారు. మైక్ సమస్య లేదా అనువాదంలో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అన్నది స్పష్టం కాకపోయినా, మోడీ ప్రదర్శించిన ఈ వ్యక్తిగత శ్రద్ధ అంతర్జాతీయ వేదికపై ఇరు దేశాల నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పింది. ప్రసంగం 4:40 నుంచి 5:11 నిమిషాల మధ్య చోటుచేసుకున్న ఈ సన్నివేశంలో జిన్‌పింగ్ చిరునవ్వుతో తల ఊపడంతో మోడీ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సమ్మిట్ ప్రారంభానికి ముందు భారత్ మంటపం వద్ద జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన తమిళనాడులోని రామేశ్వరం ‘రామనాథస్వామి ఆలయ’ 1,212 స్తంభాల ప్రసిద్ధ కారిడార్ దృశ్యాన్ని చూపుతూ, దాని ప్రాముఖ్యతను జిన్‌పింగ్‌కు మోడీ స్వయంగా వివరించారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో వీరిద్దరూ చివరిసారిగా కలుసుకున్న నేపథ్యంలో ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేలా ఈ వేదికను రూపొందించడం విశేషం. ఆ తర్వాత 2020లో గల్వాన్ లోయ వివాదంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, 2024 నుంచి మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయి. నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించడం, చైనా పెట్టుబడులపై నిబంధనలను భారత్ సడలించడం ఇందుకు నిదర్శనం. ఇక, ఈ సదస్సులో మోడీ, జిన్‌పింగ్ సుదీర్ఘంగా కరచాలనం చేస్తూ చిరునవ్వులు చిందించుకోవడం, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ముగ్గురు నాయకులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా విభేదాలు నడుస్తున్న వేళ ఈ ముగ్గురు నేతల బాండింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికితోడు, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ విడుదల చేసిన ‘బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్’పై పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా కూడా సంతకం చేయడం భారత్ సాధించిన దౌత్య విజయం.