PM Modi: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. భారత్లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. తాజాగా నోయిడాలోని ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. చమురు సంక్షోభానికి చెక్ పెట్టేలా మోడీ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడాలని సూచించారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం.. ఇథనాల్ వాడకం పెరిగితే.. రైతులకు ఆదాయం పెరుగుతుందని ప్రధాని తెలిపారు. ఇక సామాన్య ప్రజలు, రైతులుపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. నోయిడాలో సెమీకండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నామని వివరించారు. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.
READ MORE: Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
ఇక ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Jewar Airport)ఉత్తరభారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుందని ప్రధాని తెలిపారు. “ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులో కి కూడా వచ్చింది. రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే ధైర్యం చేయలేదు.” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందని వెల్లడించారు.