Mobile Theft: బిహార్లోని ఖగారియా జిల్లాలో ఓ మొబైల్ దొంగతనం యత్నం అనుకోని పరిణామాలకు దారితీసింది. ప్రయాణికుడి మొబైల్ను కిటికీ బయట నుంచి లాక్కునే ప్రయత్నం చేయగా.. సదరు దొంగను ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడిని వదిలేస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడే ప్రమాదం ఉండటంతో.. చేతిని గట్టిగా పట్టుకుని 9 కి.మీ. పాటు రైలుకు వేలాడేలా ఉంచి, చివరకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటన శుక్రవారం రాత్రి జనహిత్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. మాన్సీ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే కిటికీ పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడి మొబైల్ను బయట నుంచి లాక్కునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. అయితే పక్కనే ఉన్న ప్రయాణికులు వెంటనే స్పందించి అతడి చేతిని గట్టిగా పట్టుకోవడంతో దొంగతనం విఫలమైంది. దీంతో నిందితుడు రైలు కిటికీ బయట వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. రైలు వేగంగా దూసుకెళ్తున్నప్పటికీ ప్రయాణికులు అతడి చేతిని వదల్లేదు. మధ్యలో అతడు చేతిని వదిలేయాలని వేడుకుంటూ కేకలు వేసినా.. వదిలేస్తే కిందపడిపోయి ప్రాణాపాయం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రయాణికులు అతడిని గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు అతడిని చెంపదెబ్బలు కూడా కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
9 కి.మీ. ప్రయాణం తర్వాత రైలు ఖగారియా స్టేషన్కు చేరుకోగానే ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మొదట తన పేరు ఛోటు యాదవ్, తర్వాత పంకజ్ యాదవ్ అని చెబుతూ.. తాను మొబైల్ దొంగతనం చేయలేదని, కేవలం రైలులోని వారిని చూస్తున్నానని అన్నాడు. అయితే పోలీసుల విచారణలో అతడు చెప్పిన వివరాలన్నీ అబద్ధమని తేలింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడి అసలు పేరు బర్కత్ మన్సూరీగా గుర్తించారు. అతడు నౌగాచియా ప్రాంతంలోని ముమ్తాజ్ మొహల్లాకు చెందినవాడని.. గతంలో కూడా చోరీలు, మొబైల్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

