చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదన్నారు. ఇటీవల కోవా బన్ను అమ్ముకుంటున్న ఒక చిరు వ్యాపారిపై జరిగిన ఘటన తర్వాత, అతను శివరాత్రి రోజున కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేయడంతో.. వ్యక్తిగతంగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, ఎలాంటి అనుమానాలు ఉన్నా చట్టపరంగా అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు సూచించారు. వలి వంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం అభినందనీయమన్నారు.
Also Read: Pathum Nissanka: శ్రీలంక ‘సూపర్ స్టార్’ పాతుమ్ నిశాంక.. సంగా-సూర్య-జయ లాగే..!
ఈ ఘటనను మత కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేసిన నాగబాబు.. తక్కువ మూలధనంతో స్వయం ఉపాధి చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్న చిరు వ్యాపారులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతం పైగా పేద ప్రజలు చిరు వ్యాపారులపై ఆధారపడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నాగబాబు సూచించారు. ఇటీవల మేడారం మహా జాతరలో కర్నూలుకు చెందిన వలీ.. రూ.10కే కోవాబన్ను విక్రయిస్తుండగా కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అతడిని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుటుంబం వ్యాపారం చేసుకునేందుకు భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనలో ధైర్యాన్ని నింపేందుకు వలీకి రాజకీయ నాయకులూ అండగా నిలుస్తున్నారు.
