మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని, ఇటీవల జారీ చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. దీని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె మండిపడ్డారు. రోస్టర్ పాయింట్లు లేకుండా అసలు మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల కల్పించగలరా ? 546 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారు ? అని ఆమె ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.