NTV Telugu Site icon

Minister Seethakka: బండి సంజయ్.. భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు!

Seethakka

Seethakka

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దని హెచ్చరించారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని కోరారు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప.. మీరు దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేయడం అవసరమా? అని సీతక్క మండిపడ్డారు. కరీంగనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మాది ఇండియా టీమ్… కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా, పాకిస్తాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అని బండి సంజయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. ‘గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి.. జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు. అందుకే సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్-పాకిస్తాన్, హిందూ-ముస్లిం అన్నటున్నారు’ ఫైర్ అయ్యారు.

‘సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా.. పట్టభద్రులకు మీరేం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కుబీజేపీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?, ఎంత ఉపాధి కల్పించారు?. ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. దేవునికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా జీఎస్టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. ఎన్నికలప్పుడే హిందూ-ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది. బండి గారికి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి. ఆకలి చావులు, అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని అవమానపర్చకండి బండి గారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండిని బీజేపీ పెద్దలు నియంత్రించాలి’ అని మంత్రి సీతక్క కోరారు.

‘భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. మీరు చేసింది శూన్యం. పట్టభద్రులారా ఆలోచించండి.. విద్యావేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. సంవత్సర కాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. బావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి. యువతని మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయం. బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే. ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది. అన్ని రంగాలలో వెనుకబడ్డ పాకిస్తాన్తో భారతదేశంని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలి’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.