NTV Telugu Site icon

Grandhi Srinivas: పవన్‌పై ఎమ్మెల్యే సెటైర్లు.. అనసూయ వచ్చినా జనం కిక్కిరిసిపోతారు..!

Grandhi Srinivas

Grandhi Srinivas

Grandhi Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. పవన్ పార్టీ ఎందుకు పెట్టారు అనేది అందరికీ తెలుసన్న ఆయన.. చంద్రబాబు ప్రయోజనాలకోసం పని చేస్తున్న పవన్.. కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారు.. ముందు పవన్ పార్టీ గుర్తు, పార్టీని కాపాడుకొడంపై దృష్టి పెట్టాలని సూచించారు. భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్‌ చేశారు.. గోదావరి జిల్లాలో రౌడీఇజం అనేది పెద్ద జోక్ అంటూ పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన ఆయన.. చిరంజీవి కూతురు శ్రీజ తన బాబాయ్ వల్ల ప్రాణహాని ఉందని చెప్పిన విషయం, ఆ సమయంలో గన్ పట్టుకుని పవన్.. రౌడీగా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని కామెంట్‌ చేశారు.. పీక నొక్కేయడం, గుడ్డలు ఊడదీసి కొట్టడం, మక్కెలు ఇరగదీయడం.. ఇవే పవన్‌ కల్యాణ్ మేనిఫెస్టో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని, రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు కళ్లతో చూస్తున్నారు.. అందుకే వైసీపీ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదంటూ ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌.

Read Also: Salaar: ప్రభాస్ పక్కన మరో కన్నడ స్టార్ హీరోని రంగంలోకి దించిన ప్రశాంత్ నీల్…

మరోవైపు, పవన్ కు వ్యక్తిత్వం లేదని.. విశ్వసనీయత లేని వ్యక్తి పవన్ అంటూ విమర్శించిన విషయం విదితమే.. 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో జనసేనకు విముక్తి పలికారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ వారాహి యాత్ర చేపట్టారు అంటూ ఆరోపించారు.. గోదావరి జిల్లాలో రౌడియిజం, గుండాయిజం చేసేది.. ఎవరో ప్రజలకు తెలుసని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. గతంలో హిరో రాజశేఖర్, జీవితలపై రౌడీయిజం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు.. గతంలో భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయి తరువాత.. నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదు.. అటువంటి పవన్ మరోసారి వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని మండిపడిన విషయం విదితమే.