Girl Missing: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో కలకలం రేపిన 12 ఏళ్ల బాలిక అదృశ్యం కేసు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ మిస్టరీని మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన బాలికతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడు కూడా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!
అసలేం జరిగిందన్న విషయానికి వెళితే.. ఈ నెల 27న కరీమాబాద్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి హోంవర్క్ చేసుకుని వస్తానని తల్లికి చెప్పి బయటకు వెళ్లింది. అయితే రాత్రి దాటినా బాలిక తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక ఒంటరిగా వెళ్లలేదని.. అదే ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలుడితో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో గాలించిన పోలీసులకు ఈ ఇద్దరు చిన్నారులు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉన్నట్లు సమాచారం అందింది.
MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి CID నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్యే
చిన్నారుల ఆచూకీ దొరకడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ధర్మవరంలో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులను క్షేమంగా వరంగల్ కు తీసుకువచ్చేందుకు మిల్స్ కాలనీ పోలీసు బృందం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు బయలుదేరి వెళ్లింది. వారు తిరిగి వచ్చిన తర్వాత చిన్నారులు అంత దూరం ఎందుకు వెళ్లారు.? అనే విషయాలపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
