Buddha Venkanna: బీసీల ముద్దుబిడ్డ, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు!

  • సీఎస్‌గా విజయానంద్
  • మంత్రి సవిత హర్షం వ్యక్తం
  • బీసీల ముద్దుబిడ్డ చంద్రబాబు
Buddha Venkanna, Savitha

Buddha Venkanna, Savitha

బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. బీసీల ముద్దుబిడ్డ సీఎం చంద్రబాబు అని, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం పదవీవిరమణ చేయనుండగా.. ఆ స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు చేపడతారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్‌కి సీఏస్ బాధ్యతలు ఇవ్వడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ‘వైసీపీ హయాంలో సీఏస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒక సామాజిక వర్గమే. బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైంది. డీజీపీ, సీఎస్ కీలక పోస్టుల్లో ఉన్న వాళ్లంతా బీసీలే. వైస్ జగన్ రెడ్డి బీసీలకు కత్తిపీట వేస్తే.. చంద్రబాబు పెద్దపేట వేశారు. బీసీల ముద్దుబిడ్డ చంద్రబాబు. వెనుకబడిన తరగతుల పక్షపాతి సీఎం చంద్రబాబు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోంది’ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

విజయానంద్‌ను సీఎస్‌గా నియమించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. బీసీలకు ఎల్లప్పుడూ టీడీపీ పెద్దపీట వేస్తుంది. బలహీనవర్గాల పట్ల నిబద్ధతను మరోసారి సీఎం చంద్రబాబు చాటుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో ఒక సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెట్టారు. నూతన సీఎస్‌గా నియమితులైన విజయానంద్‌కు శుభాకాంక్షలు’ అని మంత్రి తెలిపారు.