NTV Telugu Site icon

Minister RK Roja: రజనీకాంత్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌.. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపెట్టేలా..!

Rk Roja

Rk Roja

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల వేదికగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించిన ఆమె.. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానన్న రోజా.. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా విమర్శించారు.. ఇక, చంద్రబాబు విజన్‌, హైదరాబాద్‌ అభివృద్ధిపై రజనీ చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చిన రోజా.. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డే అన్నారు.. దానికి కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలని సూచించారు మంత్రి రోజా.

Read Also: Nora Fatehi: నోరా నువ్వు డ్రస్‌ వేసుకున్నావా? అలా చూపిస్తే ఎలా?

ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదని హితవుపలికారు మంత్రి రోజా.. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేసిన ఆమె… విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేదికగా చేసిన కామెంట్లతో రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారు. ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. మరోవైపు.. రజనీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు మంత్రి ఆర్కే రోజా.

కాగా, నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌ లో ఘనంగా నిర్వహించారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం విదితమే.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న రజనీకాంత్.. ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ, అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అమోఘం. ఎన్టీఆర్ తో టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్‌ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి. యాదృచ్చికమైన నాకు అది ఎంతో ఆనందాన్ని కలుగజేసిందని పేర్కొన్న విషయం విదితమే. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్‌ ఏంటో ప్రపంచానికి తెలుసు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.